ముగిసిన డెడ్ లైన్ : ఆర్టీసీ ఫ్యూచర్పై అయోమయం

తెలంగాణ ఆర్టీసీ ఫ్యూచర్పై అయోమయం నెలకొంది. దీనిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఉంది. సీఎం కేసీఆర్..కార్మికులకు ఇచ్చిన డెడ్ లైన్ ముగియడంతో 2019, నవంబర్ 06వ తేదీ బుధవారం సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. నవంబర్ 05వ తేదీ రాత్రి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్ను కలిశారు. ఆర్టీసీలో నెలకొన్న పరిస్థితులను తెలియచేశారు.
ఇదిలా ఉంటే..తెలంగాణ సర్కార్ హెచ్చరికకు ఆర్టీసీ కార్మికులు ఏమాత్రం స్పందించలేదు. 2019, నవంబర్ 05వ తేదీ మంగళవారం అర్ధరాత్రితో డెడ్లైన్ ముగిసినా… కార్మికులు పట్టించుకోలేదు. 50 వేల ఆర్టీసీ కార్మికులకుగాను.. కేవలం వందల్లో మాత్రమే విధుల్లో చేరారు. అంతేకాదు.. సమ్మెను మరింత ఉధృతం చేసే దిశగా అడుగులేస్తున్నారు. ప్రైవేటు బస్సులకు పర్మిట్లనిచ్చే దిశగా చేపడుతున్న చర్యలు సైతం కార్మికులను పెద్దగా ప్రభావితం చేయలేకపోయాయి.
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు నెల రోజులుగా సమ్మెలో ఉన్నారు. ప్రభుత్వం చర్చలు ప్రారంభిస్తే తప్పించి సమ్మెను విరమించేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు. ఇటు హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ సమ్మెపై జేఏసీ నేతలు పట్టుదలగా ఉన్నారు. ఆర్టీసీ ఉధ్యోగులను తొలిగించే అధికారం ప్రభుత్వానికి లేనే లేదంటున్నారు. 1950 రోడ్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ ప్రకారం… ఆర్టీసీలో కేంద్రానికి 31 శాతం… రాష్ట్రానికి 69 శాతం వాటా ఉంది. కాబట్టి ఆర్టీసీ అస్థిత్వాన్ని దెబ్బతీసేలా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా… కేంద్రం అనుమతి, ఆమోదం తప్పనిసరి అంటున్నారు జేఏసీ నేతలు. దీనికితోడు రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటిదాకా ఆర్టీసీ ఆస్తుల పంపకాలు పూర్తి కాలేదని… రాష్ట్ర ప్రభుత్వానికి తమను తొలగించే అధికారమే లేదంటున్నారు.
హైకోర్టే తమకు న్యాయం చేస్తుందని కార్మికుల్లో ధీమా కనిపిస్తోంది. ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఇప్పటికే కోర్టు కూడా తీవ్రంగా తప్పుబట్టింది. ఆర్టీసీని ఆదుకునేందుకు తీసుకున్న చర్యలు, సంస్థ నష్టాలకు కారణం ఎవరన్నదానిపై కోర్టుకు సమర్పించిన నివేదికలపై ప్రశ్నించింది. ఈ క్రమంలో ఆర్టీసీ సమ్మెపై నవంబర్ 07వ తేదీ గురువారం హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. చీఫ్ సెక్రటరీ, ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ, జీహెచ్ఎంసీ కమిషనర్ హైకోర్టు ఎదుట హాజరుకానున్నారు. అయితే హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా రాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని తెలుస్తోంది. కేసు సుప్రీంకోర్టుకు చేరితే మరింత సమయం పడుతుందని… అందుకే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడమే మంచిదనే యోచనలో సర్కార్ ఉందని సమాచారం. మొత్తానికి ఆర్టీసీ అంశంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశముందని తెలుస్తోంది.
Read More : కాంగ్రెస్ నేతల భేటీ రసాభాస : ఆజాద్ ఎదుటే వీహెచ్, షబ్బీర్ అలీ వాగ్వాదం