బడ్జెట్ 2021-22 : దేశాన్ని అమ్మకానికి పెట్టిన మోడీ సర్కార్

బడ్జెట్ 2021-22 : దేశాన్ని అమ్మకానికి పెట్టిన మోడీ సర్కార్

Updated On : February 1, 2021 / 7:34 PM IST

Budget 2021 కేంద్ర ఆర్థిక మంత్రి సోమవారం పార్లమెంట్​లో ప్రవేశపెట్టిన బడ్జెట్​-2021-2022పై విపక్షాలు పెదవి విరిచాయి. దేశాన్ని అమ్మేయడమే లక్ష్యంగా బడ్జెట్​లో కేటాయింపులు ఉన్నాయని..ఇది పూర్తిగా దూరదృష్టి లేని బడ్జెట్​ అని మండిపడ్డాయి. రోగమొకటైతే మందొకటి అన్నచందంగా బడ్జెట్​ ఉందని కాంగ్రెస్​ విమర్శించింది. క్షీణిస్తున్న జీడీపీని గాలికొదిలేశారని ఆరోపించారు.

బడ్జెట్​తో పేదలకు అండగా నిలవాల్సిన మోడీ సర్కార్​.. ప్రభుత్వ ఆస్తులను తన పెట్టుబడిదారి మిత్రులకు కట్టబెట్టేలా కేటాయింపులు చేసినట్లు కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రైతులు, కార్మికులు, ఎంఎస్​ఎంఈలకు ఊతమందించాలని డిమాండ్​ చేశారు. రక్షణ రంగానికి చేసిన కేటాయింపులపై రాహుల్​ అసంతృప్తి వ్యక్తం చేశారు.

క్లిష్ట పరిస్థితుల్లో పేదలకు ఊతమిచ్చేలా గొప్ప బడ్జెట్​ను ప్రవేశపెడతారని భావించామని కాంగ్రెస్ లోక్​సభాపక్షనేత అధీర్ రంజన్​ చౌధురీ అన్నారు. అయితే అస్పష్టమైన చర్యలతో సాధారణ బడ్జెట్​ను ప్రవేశపెట్టారన్నారు. కొన్ని రాష్ట్రాల్లో రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్​ను రూపొందించారన్నారు. పెట్టుబడులు ఉపసంహరణ, ప్రవేటీకరణ వంటి చర్యలతో.. ప్రభుత్వం దేశాన్ని అమ్మకానికి పెట్టిందని కాంగ్రెస్ లోక్​సభాపక్ష నేత అధీర్​ రంజన్​ చౌదరి విమర్శించారు.

ఆర్థిక మంత్రి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారని కాంగ్రెస్ సీనియర్​ నేత ఆనందద్​ శర్మ అన్నారు. బలహీన వర్గాలకు నేరుగా సాయమందిస్తే.. ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యేవని శర్మ అన్నారు. ధనార్జన లక్ష్యంగా ప్రవేశపెట్టిన బడ్జెట్​ అని ఆరోపించారు మరో కాంగ్రెస్​ నేత మనీశ్​ తివారీ. నేషనల్ మోనిటైజేషన్​ ప్రణాళిక దేశాన్ని అమ్మేయడానికి ఓ సులభమైన మార్గమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజా బ‌డ్జెట్ దేశం అభివృద్ధికి ఉప‌యోగ‌ప‌డేదిగా లేద‌ని, దేశాన్ని అమ్మేసేలా ఉన్న‌ద‌ని బీహార్ మాజీ ముఖ్య‌మంత్రి లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ త‌న‌యుడు, ఆర్జేడీ ఆగ్ర నాయ‌కుడు తేజ‌స్వియాద‌వ్ అన్నారు. బడ్జెట్​ పూర్తిగా ముందుచూపులేనిదని, దీని ఉద్దేశం దేశాన్ని అమ్మేయడమేనని విమర్శించించారు టీఎంసీ ప్రతినిధి ఓబ్రెయిన్​ అన్నారు. సాధారణ ప్రజలను, రైతులను విస్మరించారని..మధ్యతరగతివారికి ఏమి ఉపయోగం లేదని వ్యాఖ్యానించారు.