Prashant Kishor: విపక్షాల కూటమికోసం నితీష్ కుమార్ చేస్తున్న ప్రయత్నాలపై సెటైర్లతో విరుచుకుపడ్డ ప్రశాంత్ కిషోర్..
టీ తాగి, విలేకరుల సమావేశాలు పెడితే విపక్షాల కూమిటి ఏర్పడుతుందంటే 20ఏళ్ల క్రితమే విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చేవని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు.

Prashant Kishor
Bihar Politics: 2024లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీన్నీ ఏకతాటిపైకి వచ్చి బీజేపీని గద్దెదించాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రతిపక్షాల ఐక్యతకోసం కృషి చేస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు, మమత బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ ఇలా బీజేపీయేతర పార్టీల నేతలతో నితీష్ కుమార్ వరుస భేటీలు అవుతూ వస్తున్నారు. ఈనెల 23న ప్రతిపక్ష పార్టీల మీటింగ్ ను పాట్నాలో నిర్వహించ తలపెట్టారు. ఈ క్రమంలో ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ విపక్షాల కూటమి ప్రయత్నాలపై సెటైర్లతో విమర్శలు చేశారు.
టీ తాగి, విలేకరుల సమావేశాలు పెడితే విపక్షాల కూటమి ఏర్పడుతుందంటే 20ఏళ్ల క్రితమే విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చేవని అన్నారు. ఒక్క ఎంపీ స్థానంకూడా లేని పార్టీ దేశంలోని వివిధ పార్టీలను కూడగట్టడంలో నిమగ్నమవడం విడ్డూరంగా ఉందని బీహార్ సీఎం నితీష్ కుమార్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు లాలూ, నితీష్ కుమార్లకు సీటు ఇచ్చేందుకు మమతా బెనర్జీ అంగీకరించారా? బీహార్లో టీఎంసీకి ఒక్క సీటు అయినా ఇచ్చేందుకు లాలూ, నితీష్లు అంగీకరించారా? అని ప్రశాంత్ కిషోర్ ప్రశ్నించారు.
Nitish Kumar: వన్ ఆన్ వన్ పేరుతో.. నితీశ్ కుమార్ సరికొత్త వ్యూహం.. వర్కవుట్ అవుతుందా?
నితీష్ కుమార్ ఇటీవల ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ను కలిసేందుకు వెళ్లారు. అఖిలేష్ యాదవ్ పార్టీ సమాజ్ వాదీ పార్టీకి 2014లో ఐదు ఎంపీ సీట్లు, 2019లోకూడా ఐదు ఎంపీలు వచ్చాయి. కానీ, వారు 500 మంది ఎంపీలు మాతో ఉన్నట్లు మాట్లాడుతున్నారంటూ ప్రశాంత్ కిషోర్ అన్నారు. ప్రస్తుతం విపక్షాల కూటమి అనేవాళ్లు ఇల్లు వదిలి ఐదు కిలోమీటర్లు నడవలేరు, ఏ పని చేయలేరు, రాజకీయాల్లో ఏం చేస్తారు అని ప్రశాంత్ కిశోర్ ప్రశ్నించారు.