తమిళనాడు : వానల కోసం పూజలు

చెన్నై : నీటి కొరతతో అల్లాడుతున్న తమిళనాడు వాసులను ఆదుకోటానికి ప్రభుత్వం వరుణ యాగాలు చేయిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోనూ వరుణ జపాలు, యాగాలు చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దేవాలయాల్లో పండితులు వరుణ జపాలు, యాగాలు నిర్వహిస్తుంటే , సంగీత కళాకారులు తమ తమ గాత్రాలతో, వాయిద్యాలతో వర్షపు చినుకుల కోసం మేఘవర్షిణి, అమృతవర్షిణి రాగాలను ఆలపిస్తున్నారు.
తిరువణ్ణామలై, అరుణాచలేశ్వర టెంపుల్ లోని బ్రహ్మ తీర్ధం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తంజావూరులోనూ, చెన్నైలోని అష్టలక్ష్మీ టెంపుల్ , కపిలేశ్వరాలయం లోనూ పండితులు పూజలు నిర్వహించారు. తమిళనాడు గతంలో కూడా వానల కోసం వరుణ యాగాలు జపాలు చేయించింది.