తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు.. ఆర్జిత సేవలు రద్దు
రథసప్తమి (సూర్య జయంతి వేడుకలు) సందర్భంగా ఒకే రోజు ఏడు వాహనాలపై ఊరేగుతూ వేంకటేశ్వర స్వామివారు.. భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
Ratha Saptami 2024: రథసప్తమి వేడుకలను రేపు (శుక్రవారం) తిరుమలలో ఘనంగా నిర్వహించనున్నారు. రథసప్తమి (సూర్య జయంతి వేడుకలు) సందర్భంగా ఒకే రోజు ఏడు వాహనాలపై ఊరేగుతూ వేంకటేశ్వర స్వామివారు.. భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వేకువ జామున 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహన సేవలు ప్రారంభమవుతాయి. చిన్నశేష, గరుడ, హనుమంత, చక్రస్నానం, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాల్లో భక్తులకు స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు.
స్వామి వారి వాహన సేవలు తిలకించేందుకు విచ్చేసే భక్తుల కోసం టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. రథసప్తమి వేడుకల సందర్భంగా రేపు ఆర్జిత సేవలును టీటీడీ రద్దు చేసింది. స్వామి వారికి సుప్రభాతం, తోమాల, అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహించనున్నారు. మాడవీధుల్లోని గ్యాలరీలలో వేచిఉండే భక్తులకు నిర్విరామంగా అన్నపానీయాలు సరఫరా చేయనుంది. కాగా, సూర్య జయంతి వేడుకలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో తిరుమల కొండకు వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది.
Also Read: మోదీ చేతుల మీదుగా అబుదాబిలో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభం
తిరుమల సమాచారం
నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 67,275
నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ 3.07 కోట్లు
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
18 కంపార్ట్ మెట్లలో వేచి ఉన్న భక్తులు
టోకెన్ లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం