కీలక మార్పులతో బరిలోకి టీమిండియా

తొలి టీ20 పరాజయం తర్వాత సిరీస్ లో విజయానికి కీలకంగా మారిన రెండో టీ20ని గెలవాలని భారత్ పట్టుదలతో కనిపిస్తోంది. గత మ్యాచ్ లో వాతావరణం కష్టంగా అనిపించినా రోహిత్ జట్టును ఓడించిన తీరును కొనసాగించాలని బంగ్లాదేశ్ ఎదురుచూస్తోంది. మరోవైపు గుజరాత్ లోని సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియం వేదికగా గురువారం జరగనున్న ఈ మ్యాచ్ కు మహా తుఫాన్ ప్రమాదమూ పొంచి ఉంది.
భారమంతా బ్యాటింగ్ పైనే వేయకుండా బౌలర్లు కూడా సహకరిస్తేనే విజయం వరిస్తుంది. సిరీస్ ఆరంభానికి ముందే రోహిత్ బంగ్లాదేశ్ ఛాలెంజింగ్ టీమ్ గా కనిపిస్తుంది అని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్ లోనూ గెలిస్తే సిరీస్ చేజిక్కడంతో పాటు చరిత్ర సృష్టించిన జట్టుగా బంగ్లాదేశ్ మిగిలిపోతుంది. షకిబ్, తమీమ్ లాంటి కీలక ఆటగాళ్లు లేకపోయినా తొలి టీ20లో బంగ్లా జట్టు భారత్కు షాకిచ్చిన సంగతి తెలిసిందే. భారత్ వన్డే, టెస్టు ఫార్మాట్లలో చూపించిన ఆధిక్యం టీ20 క్రికెట్లో చూపించలేకపోతుంది. సొంతగడ్డపై ఆస్ట్రేలియాకు సిరీస్ కోల్పోయిన టీమిండియా.. దక్షిణాఫ్రికాతో సిరీస్ను డ్రాగా ముగించింది.
జట్టులో రెండు కీలక మార్పులు చేయనున్నట్లుగా కనిపిస్తుంది. కెప్టెన్ కోహ్లీ లాంటి ప్లేయర్లు జట్టులో లేనప్పుడు సత్తా చాటుకునేందుకు యువ క్రికెటర్లకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. తొలి మ్యాచ్ లో రాణించలేకపోయిన రోహిత్ శర్మతో పాటు యువ ప్లేయర్లు రాణిస్తేనే రెండో మ్యాచ్ గెలవగలం. ఓపెనర్ శిఖర్ ధావన్ ఫామ్, స్ట్రైక్రేట్ ఆందోళన కలిగిస్తున్నాయి. తొలి మ్యాచ్లో 42 బంతులు ఆడి 41 పరుగులే చేశాడు. టెస్టుల్లో స్థానం కోల్పోయాక కనీసం టీ20 తుది జట్టులో స్థానాన్ని సుస్థిర పరుచుకోవాలనుకుంటున్న రాహుల్ కూడా ఒత్తిడిలో ఉన్నాడు.
తొలి మ్యాచ్లో శ్రేయాస్ తప్ప ప్రత్యర్థి బౌలర్లకు పోటీ ఇవ్వలేకపోయారు. పంత్, కృనాల్, శివమ్ దూబె ఎంపికకు న్యాయం చేయాల్సి ఉంది. రిషబ్ పంత్పైనే అందరి దృష్టి ఉంది. అనుభవం లేని బౌలింగ్ దళం కూడా భారత జట్టు మేనేజ్మెంట్కు ఆందోళన కలిగిస్తోంది. తొలి మ్యాచ్లో భారీగా పరుగులిచ్చిన ఖలీల్ అహ్మద్ స్థానంలో శార్దూల్ ఠాకూర్కు అవకాశం లభించవచ్చు. వాషింగ్టన్ సుందర్, చాహల్, కృనాల్ పాండ్యలు ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను కట్టడి చేయడమే కాకుండా వికెట్లూ తీయాల్సిన అవసరముంది. రాహుల్ పేలవ ప్రదర్శన అనంతరం ప్రత్యామ్నాయంగా శాంసన్ ను పరిగణిస్తున్నారు. యువ క్రికెటర్ల సత్తా పరీక్షించే ఫార్మాట్ కాబట్టి ఈ సారి శార్దుల్కు బదులు ఖలీల్ అహ్మద్కు అవకాశమిచ్చేట్లు కనిపిస్తోంది.
జట్లు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ధావన్, రాహుల్/శాంసన్, శ్రేయస్, రిషభ్ పంత్, శివమ్ దూబే, కృనాల్ పాండ్యా, సుందర్, చహల్, దీపక్ చహర్, శార్దుల్/ఖలీల్ అహ్మద్.
బంగ్లాదేశ్: మహ్ముదుల్లా (కెప్టెన్), లిటన్ దాస్, సౌమ్య సర్కార్, నయీమ్/మిథున్, ముష్ఫికర్ రహీమ్, మొసద్దిక్ హుస్సేన్, అఫిఫ్ హుస్సేన్, ఇస్లామ్, ముస్తఫిజుర్, అల్ అమిన్/సన్నీ అరాఫత్, షఫీయుల్.