ఒక్కరినీ వదలకుండా పరీక్షలు చేయండి : వైద్య శాఖ పనితీరు భేష్ – కేసీఆర్

  • Published By: madhu ,Published On : April 6, 2020 / 01:32 AM IST
ఒక్కరినీ వదలకుండా పరీక్షలు చేయండి : వైద్య శాఖ పనితీరు భేష్ – కేసీఆర్

Updated On : April 6, 2020 / 1:32 AM IST

కరోనా వ్యాప్తి నివారణకు చేస్తున్న కృషిని మరింత అంకితభావంతో కొనసాగిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. రోగులకు వైద్యం అందిస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బందికి ప్రభుత్వం అన్ని రకాల అండగా ఉంటుందని చెప్పారు. వ్యాధి లక్షణాలున్న ఏ ఒక్కరినీ వదలకుండా పరీక్షలు నిర్వహించి, వైద్యం అందిస్తామన్నారు. వ్యాధి సోకిన వారు కలిసిన ప్రతీ ఒక్కరినీ గుర్తించి క్వారంటైన్ చేస్తున్నామని వెల్లడించారు.

కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో 2020, ఏప్రిల్ 05వ తేదీ ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే విషయంలో, వ్యాధి సోకిన వారికి వైద్యం అందించే విషయంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది బాగా పని చేస్తోందన్నారు.  

వారి భద్రతకు సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించింది.  వైద్య సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ విషయంలో ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రస్తుతం పరీక్షలకు, వైద్యానికి వస్తున్న వారికి సరిపడినంతగా టెస్ట్ కిట్స్, పీపీఈలు, మాస్కులు, ఇతర మందులు అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో పేషంట్ల సంఖ్య పెరిగినా, అందుకు అనుగుణంగా మాస్కులు, పిపిఐలు సేకరిస్తామని కేసీఆర్ ప్రకటించారు.

ఇక సీఎం సహాయ నిధికి వస్తున్న విరాళాలపై కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు.  సీఎంఆర్ఎఫ్ కు వస్తున్న విరాళాలను వైద్య సిబ్బందికి అవసరమైన మాస్కులు, పీపీఈలు, మందుల కొనుగోలుకు వాడాలని కోరారు. భవిష్యత్తులో రోగుల సంఖ్య పెరిగినా ఎలాంటి ఇబ్బంది కలగకుండా సేవలు అందించడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించి, అమలు చేయాలని సూచించారు.(గో బ్యాక్ కరోనా : ఇంకా 9 రోజులు..ఇంటి దగ్గరే ఉందాం)