Saidi Reddy : ఏపీ ప్రభుత్వం మొత్తం వచ్చినా హరీశ్ రావును ఎదుర్కోలేదు, దమ్ము ధైర్యముంటే చర్చకు రావాలి- ఏపీ మంత్రులకు తెలంగాణ ఎమ్మెల్యే సవాల్
Saidi Reddy : హరీశ్ రావు దేశంలో అందరు మంత్రులకు ఆదర్శం. మొత్తం ఏపీ ప్రభుత్వం వచ్చినా హరీశ్ రావును చర్చలో ఎదుర్కోలేదు.

Saidi Reddy (Photo : Google)
Saidi Reddy : ఏపీ, తెలంగాణ అధికార పార్టీ నేతల మాటల యుద్ధం కొనసాగుతోంది. బీఆర్ఎస్, వైసీపీ నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో రెచ్చిపోతున్నారు. సై అంటే సై అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. అభివృద్ధి అంశంపై బీఆర్ఎస్, వైసీపీ నేతలు మాటల యుద్ధానికి దిగారు.
ఏపీలో అభివృద్ది గురించి మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలతో వివాదం స్టార్ట్ అయ్యింది. అది మొదలు.. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేలుస్తున్నారు. తాజాగా తెలంగాణ ఎమ్మెల్యే సైదిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. దమ్ము ధైర్యం ఉంటే అభివృద్ధి అంశంపై తనతో చర్చకు రావాలని ఏపీ మంత్రులకు ఆయన సవాల్ విసిరారు.
”మంత్రి హరీశ్ రావుపై ఏపీ మంత్రుల వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడి. హరీశ్ రావు దేశంలో అందరు మంత్రులకు ఆదర్శం. ఏపీలో ఎవరిని అడిగినా హరీశ్ రావు గురించి చెబుతారు. హరీశ్ రావు నడిచే యంత్రం. ఓ రోబో లాంటి వారని పేరుంది. విషయం లేకనే ఏపీ మంత్రులు రెచ్చి పోతున్నారు.
ఏపీ మంత్రి అప్పలరాజు చీదర అప్పలరాజుగా మారారు. ఏపీలో అన్ని పార్టీలు మోడీ పార్టీలుగా మారాయి. హరీశ్ లాంటి వారి మీద మాట్లాడేపుడు వందసార్లు ఆలోచించుకోవాలి. తీరు మార్చుకోకపోతే ఏపీ ప్రజలు అక్కడి మంత్రుల మీద ఉమ్మేస్తారు. అభివృద్ధి ఎక్కడ ఎక్కువవుతుందో చర్చకు సిద్ధం. మా ఆత్మగౌరవాన్ని కించపరిస్తే ఊరుకునేది లేదు. దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ, ఏపీల అభివృద్ధిపై నాతో ఏపీ మంత్రులు చర్చకు రావాలి. మొత్తం ఏపీ ప్రభుత్వం వచ్చినా హరీశ్ రావును చర్చలో ఎదుర్కోలేదు.
అప్పలరాజు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అక్కడ పాలక ప్రతి పక్షాలు ఒకే తీరుగా ఉన్నాయి. హరీశ్ రావు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు. కేసీఆర్ ఒకే ఒక ఎత్తుగడ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపింది. 800 రోజులు కార్మికులు ఆందోళన చేసినా కేంద్రం దిగిరాలేదు. మాతో అభివృద్ధిలో పోటీ పడండి. కేసీఆర్ అభివృద్ధి గురించి తప్ప దేని గురించి మాట్లాడరు.
ఏపీ మంత్రులు అభివృద్ధి తప్ప అన్నీ మాట్లాడుతున్నారు. చంద్రబాబు, జగన్ ఎవరు ఢిల్లీ వెళ్లినా తమ స్వార్ధం కోసం వెళతారు. తెలంగాణ అభివృద్ధి మోడల్ ని ఏపీ అనుసరించాలి. రెండు రాష్ట్రాలు బాగుండాలి అనేదే మా తపన. దేశం కూడా బాగుండాలి” అని ఎమ్మెల్యే సైదిరెడ్డి అన్నారు.