ముగిసిన సీఎం జగన్ అమెరికా పర్యటన

ఏపీ సీఎం జగన్ అమెరికా పర్యటన ముగిసింది. భారత కాలమాన ప్రకారం ఆయన ఉదయం 7 గంటలకు చికాగో నుంచి హైదరాబాద్కు పయనమయ్యారు. 2019, ఆగస్టు 24వ తేదీ శనివారం హైదరాబాద్ చేరుకుంటారు. ఇక్కడి నుంచి విజయవాడకు వెళుతారు. ఆగస్టు 15వ తేదీన అమెరికాకు సీఎం జగన్ వెళ్లిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత పనులపై ఆయన కుటుంబసభ్యులతో వెళ్లినా..పెట్టుబడుల సమీకరణ కోసం చాలా సదస్సుల్లో పాల్గొని ప్రసంగించారు.
ప్రవాసాంధ్రుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. పెట్టుబడులు పెట్టే వారికి ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీనిచ్చారు. వివిధ పారిశ్రామిక వేత్తలతో ఆయన భేటీ అయ్యారు. వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించారు సీఎం జగన్. అమెరికా విదేశాంగ దక్షిణాసియా వ్యవహారాల ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు. వాషింగ్టన్లో యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కీలక మీటింగ్ హాజరై భారత రాయబారి హర్షవర్ధన్ ష్రింగ్లాతో సమావేశమై ముఖాముఖి చర్చలు జరిపారు.
యూస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమలు పెట్టాలని అనుకొనే వారు ఒకే ఒక్క దరఖాస్తు నింపితే చాలన్నారు సీఎం జగన్. పరిశ్రమలకు అవసరమైన భూమి, కరెంటు, నీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని, ఇరుగుపొరుగు రాష్ట్రాలతో మంచి సంబంధాలున్నాయన్నారు. ఆగస్టు 17న డల్లాస్లో పర్యటించారు. ఆగస్టు 18న వాషింగ్టన్లో వ్యాపార సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఆగస్టు 19 నుంచి 21 వరకు వ్యక్తిగత పనులతో బిజీగా ఉన్నారు. ఆగస్టు 22 మధ్యాహ్నం షికాగోలో కొన్ని సంస్థల ప్రతినిధులను కలుసుకున్నారు. అదే రోజు రాత్రి అమెరికా నుంచి పయనమయ్యారు సీఎం జగన్.
Read More : రాజధాని అమరావతే : సీఎం జగన్ ఆ రోజే చెప్పారట