Gujarat Bridge Collapse : గుజరాత్ లో కేబుల్ బ్రిడ్జి ప్రమాదం.. 141కు చేరిన మృతుల సంఖ్య
గుజరాత్లో మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 141కు చేరింది. ఇప్పటివరకు 177 మందిని రక్షించారు. మోర్బి జిల్లాలోని మచ్చు నదిపై ఉన్న బ్రిటిష్ కాలం నాటి కేబుల్ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం కుప్పకూలిన విషయం తెలిసిందే.
Gujarat Bridge Collapse : గుజరాత్లో మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 141కు చేరింది. ఇప్పటివరకు 177 మందిని రక్షించారు. మోర్బి జిల్లాలోని మచ్చు నదిపై ఉన్న బ్రిటిష్ కాలం నాటి కేబుల్ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం కుప్పకూలిన విషయం తెలిసిందే. బ్రిడ్జి ఒక్కసారిగా తెగిపోవడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు నదిలో పడిపోయారు. ప్రమాద సమయంలో వంతెనపై దాదాపు 500 మందికిపైగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిలో ఇప్పటివరకు 141 మంది మృతి చెందారు. మరో 19 మందికి గాయాలయ్యాయని.. వారిని ఆస్పత్రికి తరలించామని చెప్పారు.
177 మందిని సహాయక సిబ్బంది సురక్షితంగా నదిలో నుంచి బయటికి తీసుకొచ్చారని వెల్లడించారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యల్లో పలుపంచుకుంటున్నారని చెప్పారు. 765 అడుగుల పొడవు ఉండే ఈ కేబుల్ బ్రిడ్జిని 1879లో నిర్మించారు. ఇటీవలే దాన్ని ఆధునీకరించి పర్యాటకుల కోసం ఈ నెల 26న తిరిగి ప్రారంభించారు. అయితే ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండానే బ్రిడ్జిని పునఃప్రారంభించినట్టు తెలిసింది.
ఆదివారం సాయంత్రం ఛాట్పూజలో భాగంగా నదిలో పుణ్యస్నానాలు చేయడానికి వచ్చిన ప్రజలు కేబుల్ బ్రిడ్జిపైకి ఎక్కారని అధికారులు పేర్కొన్నారు. అయితే కొందరు యువకులు ఉద్దేశపూర్వకంగా బ్రిడ్జిని ఊపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో వంతెన కుప్పకూలిందని చెప్పారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు అధికంగా ఉన్నారని వెల్లడించారు.