రాయపాటిపై కేసు నమోదు చేసిన ఈడీ

  • Published By: chvmurthy ,Published On : January 3, 2020 / 04:11 AM IST
రాయపాటిపై కేసు నమోదు చేసిన ఈడీ

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై ఈడీ కేసు నమోదు చేసింది. నిబంధనలకు విరుధ్దంగా నిధుల మళ్లించారనే అభియోగంతో ఫెమా చట్టం కింద  రాయపాటితోపాటు ట్రాన్స్ ట్రాయ్  కంపెనీపైనా కేసు నమోదుఅయ్యింది. 16 కోట్ల రూపాయలు సింగపూర్, మలేషియాలకు మళ్లించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.  

ఇప్పటికే రాయపాటితో పాటు కుమారుడు రంగారావు, ట్రాన్స్ ట్రాయ్ కంపెనీలపై సీబీఐ కేసు నమోదుచేసింది. 15 బ్యాంకుల నుంచి.రూ.8.832 కోట్ల రూపాయలను ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ రుణంగా తీసుకుని ఎగవేసింది. ట్రాన్స్‌ట్రాయ్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థ తీసుకున్న రుణానికి సకాలంలో డబ్బులు చెల్లించడం లేదని, 2015లోనే బ్యాంకుల కన్సార్షియం సదరు సంస్థ ఖాతాను ఎన్‌పీఏ  (నిరర్థక ఖాతా)గా ప్రకటించింది. దీంతో ఇతర ఖాతాల ద్వారా లావాదేవీలు జరిపినట్లు ఆరోపణ లున్నాయి.

దేశీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను.. ఇతర ఖాతాల ద్వారా విదేశాలకు మళ్లించారని సీబీఐ అనుమానిస్తోంది. రూ.264 కోట్ల నిధుల మళ్లింపుపై యూనియన్‌ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదుపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్న క్రమంలో ఈ విషయాలన్నీ వెలుగు చూస్తున్నట్లు తెలిసింది.   

మరో వైపు …ట్రాన్స్‌ట్రాయ్‌ ఇండియా లిమిటెడ్‌ ఎండీ చెరుకూరి శ్రీధర్‌ ఇచ్చిన విరాళాలపైనా సీబీఐ దృష్టి సారించింది. 2012 నవంబర్‌ 17న తిరుచానూరు పద్మావతి అమ్మవారికి రూ.4.33 కోట్ల విలువైన బంగారు చీరను కానుకగా సమర్పించారు. ఆ బంగారు చీర తయారీకి ఎనిమిది కిలోల బంగారం (8086.97 గ్రాములు), 879.438 గ్రాముల వజ్రాలు, పగడాలు ఉపయోగించారు.  

2013 డిసెంబర్‌ 5న తిరుమల శ్రీవారి నిత్యాన్నదానం ట్రస్టుకు రూ.3.42 కోట్లు విరాళంగా ఇచ్చారు.  ఈ నిధులు వారికి ఎక్కడ నుంచి వచ్చాయనే విషయంపై కూడా సీబీఐ వివరాలు  సేకరిస్తోంది. కాగా,  గతంలో 2013కు ముందు ఈ సంస్థ ఆదాయ పన్ను శాఖకు సమర్పించిన ఐటీ రిటర్నులు, బ్యాలెన్స్‌ షీట్లను కూడా ఈడీ అధికారులు పరిశీలించనున్నారని తెలుస్తోంది.