ముంబై గ్యాంగ్ స్టర్ మైసూర్ లో ఎన్ కౌంటర్
మైసూరు: ముంబై కి చెందిన గ్యాంగ్ స్టర్ ఒకరు మైసూరు పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో మృతి చెందాడు. మైసూరులోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. పాత నోట్లు మారుస్తున్నారనే ముందస్తు సమాచారం తో పోలీసులు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఉన్న అపార్ట్ మెంట్ లో ఉన్న ముఠా సభ్యులను చుట్టుముట్టారు. పోలీసులను చూసిన గ్యాంగ్ లోని సభ్యులు కాల్పులు జరుపుతూ తప్పించుకు పారిపోవటానికి ప్రయత్నించారు.
పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడి పోలీసులకు చిక్కాడు. పోలీసుల వెంటనే అతడ్ని చికిత్స నిమిత్తం కే.ఆర్. ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందూతూ నిందితుడు మరణించాడు. నిందితుడు ముంబైకి చెందిన 40 ఏళ్ల గ్యాంగ్ స్టర్ గా పోలీసులు గుర్తించారు. మిగిలిన ముగ్గురు సభ్యులు తప్పించుకు పారిపోయారు. వీరు గత కొద్ది రోజులుగా విజయనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక అపార్ట్ మెంట్ లో అద్దెకు ఉంటున్నారని పోలీసు కమీషనర్ కే.టీ బాలకృష్ణ చెప్పారు. ఘటనా స్ధలం నుంచి నిందితులు వాడిన కారును స్వాధీనం చేసుకున్నారు. ఆ కారు మైసూరుకు చెందిన వ్యక్తిదిగా పోలీసులు గుర్తించారు. తప్పించుకుని పారిపోయిన మిగతా సభ్యుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.