Farmers Tractor March : తగ్గేదే లే..పార్లమెంట్ కు రైతుల ట్రాక్టర్ మార్చ్!
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన తర్వాత కూడా.. రాబోయే శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటుకు ప్రతిపాదిత రోజువారీ ట్రాక్టర్ మార్చ్
Farmers Tractor March : మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన తర్వాత కూడా.. రాబోయే శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటుకు ప్రతిపాదిత రోజువారీ ట్రాక్టర్ మార్చ్ ఉపసంహరణపై రైతు సంఘాలు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పార్లమెంట్ కు ట్రాక్టర్ మార్చ్ ఆందోళన కొనసాగించాలా వద్దా అన్నది ఆదివారం రైతు సంఘాల నేతలు సమావేశమై నిర్ణయించనున్నారు.
శనివారం రైతు నాయకుడు మరియు సంయుక్త్ కిసాన్ మోర్చా(SKM) కోర్ కమిటీ సభ్యుడు దర్శన్ పాల్ మాట్లాడుతూ…”పార్లమెంటుకు ట్రాక్టర్ మార్చ్ అనే మా పిలుపు ఇప్పటికీ అలాగే ఉంది. ఆదివారం నాడు సింగు బోర్డర్లో జరిగే సంయుక్త్ కిసాన్ మోర్చా సమావేశంలో ఆందోళన మరియు MSP(పంటలకు కనీస మద్దతు ధర) సమస్యల భవిష్యత్ కార్యాచరణపై తుది నిర్ణయం తీసుకోబడుతుంది ”అని తెలిపారు.
రైతు నాయకుడు, భారతీయ కిసాన్ యూనియన్ (ఉగ్రహన్) అధ్యక్షుడు జోగీందర్ సింగ్ ఉగ్రహన్ శనివారం టిక్రి సరిహద్దు పాయింట్ వద్ద మాట్లాడుతూ..” ట్రాక్టర్ మార్చ్ ఇంకా ఉపసంహరించుకోలేదు. పార్లమెంటుకు ట్రాక్టర్ మార్చ్ పిలుపుపై SKM నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటివరకైతే, దానిని ఉపసంహరించుకోవాలని పిలుపు లేదు. SKM కోర్ కమిటీ సమావేశం తర్వాత ఆదివారం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది” అని చెప్పారు.
కాగా,సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనకు ఒక సంవత్సరం పూర్తి కావస్తున్న నేపథ్యంలో నవంబర్-29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రతిరోజు 500 మంది రైతులు శాంతియుతంగా పార్లమెంటుకు ట్రాక్టర్ల మీద ర్యాలీగా వెళ్తారని సంయుక్త కిసాన్ మోర్చా (SKM) ఈ నెల ప్రారంభంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రైతులకు మోదీ క్షమాపణలు కూడా చెప్పారు.
ALSO READ Telangana Rains : తెలంగాణలో తేలికపాటి వర్షాలు.. రాబోయే 3 రోజులు జాగ్రత్త!