అమెరికా కన్నా భారత్ లోనే ఎక్కువ కరోనా మరణాలు
భారత్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఏడు లక్షలు దాటింది. మరోవైపు దేశంలో కరోనా మరణాల సంఖ్య కలవరపాటుకు గురిచేస్తోంది. గడిచిన 24 గంటల్లో అమెరికాలో నమోదైన కోవిడ్-19 మరణాల కంటే భారత్లో నమోదైన కరోనా మరణాలే ఎక్కువగా ఉండటం మరింత ఆందోళనకు గురిచేసే విషయం.
అమెరికాలో గత 24 గంటల్లో 271 మంది కరోనాతో మరణిస్తే.. భారత్లో 425 మంది మరణించారు. కరోనా వల్ల తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో 29 లక్షల కరోనా కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. భారత్ మూడవ స్థానంలో ఉంది. బ్రెజిల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. బ్రెజిల్లో కరోనా మరణాలు కల్లోలం రేపుతున్నాయి. గత 24 గంటల్లో బ్రెజిల్లో కరోనా వల్ల 602 మంది మరణించారు.
భారత్ లో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 20,160గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. భారత్లో కరోనా మరణాల రేటు క్రమేపి తగ్గుతుండటం కాస్త ఊరట కలిగించే విషయం. ఇప్పటి వరకు ఇండియాలో కోటి మందికిపైగా కరోనా పరీక్షలను నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. వైరస్ మరణాల్లో భారత్ 8వ స్థానంలో ఉన్నది.
ఇక, అమెరికాలో ఇటీవల కరోనా మరణాలు కాస్త తగ్గుముఖం పట్టినా మొత్తం కరోనా మరణాల సంఖ్య మాత్రం అమెరికాలోనే ఎక్కువ. అమెరికాలో ఇప్పటివరకూ 1,29,947 మంది కరోనా సోకి మరణించారు. బ్రెజిల్లో కరోనా మరణాలు 65వేలకు చేరుకున్నాయి..
Read Here>>కోవిడ్ -19 ఔషధంపై బయోటెక్, బీ-ఫార్మసీ స్టూడెంట్స్ రీసెర్చ్