నేటి నుంచి జేఈఈ మెయిన్ ఎగ్జామ్స్..ఆలస్యంగా వస్తే నో ఎంట్రీ, కరోనా లేదని సెల్ఫ్ డిక్లరేషన్
JEE Main-2021 Exams : జేఈఈ మెయిన్-2021 పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్నాయి. IIT, NIT తదితర ప్రతిష్ఠాత్మక సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షలు.. బుధ, గురు, శుక్రవారాల్లోనూ పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో జరిగే ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 6 లక్షల 61 వేల 761 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. తెలంగాణ నుంచి 73 వేల 782 మంది.. ఏపీ నుంచి 87 వేల 797 మంది పరీక్ష రాయనున్నారు.
ఇక ఇప్పటికే పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గైడ్లైన్స్ పంపింది. విద్యార్థులు తమకు కరోనా లేదని సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పరీక్ష ప్రారంభానికి రెండుగంటల ముందే కేంద్రానికి చేరుకోవాలని.. ఆలస్యంగా వచ్చేవారిని లోపలికి అనుమతించబోమని ఎన్టీఏ వర్గాలు తెలిపాయి.
హాల్ టికెట్తో పాటు ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, పాస్పోర్ట్లలో ఏదో ఒక గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. జేఈఈ మెయిన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో అప్లోడ్ చేసినట్టుగానే ఉన్న పాస్పోర్ట్ సైజ్ ఫొటోను కూడా విద్యార్థులు వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.