ప్రతిపక్షాలకు మోడీ సవాల్ : దమ్ము ఉంటే ఆర్టికల్ 370ని తిరిగి ప్రవేశపెడతామని మేనిఫెస్టోలో పెట్టండి

  • Published By: venkaiahnaidu ,Published On : October 13, 2019 / 11:59 AM IST
ప్రతిపక్షాలకు మోడీ సవాల్ : దమ్ము ఉంటే ఆర్టికల్ 370ని తిరిగి ప్రవేశపెడతామని మేనిఫెస్టోలో పెట్టండి

జమ్మూకశ్మీర్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రతిపక్షాలు చేసిన కంప్లెయింట్ లపై ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ(అక్టోబర్-13,2019) సవాల్ చేశారు. ప్రతిపక్షాలకు ధైర్యం ఉంటే ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలన్నారు. ప్రతిపక్షాలకు దమ్ము ఉంటే ఖచ్చితమైన వైఖరి తీసుకుని ముందుకు రావాలని మోడీ సవాల్ విసిరారు.

మహారాష్ట్రలోని జల్ గాన్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రతిపక్షాలను ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ…ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావడానికి ఎవరికైనా ధైర్యం ఉందని మీరు అనుకుంటున్నారా? ఎవరైనా ధైర్యం చేస్తే వారి రాజకీయ జీవితం మనుగడ సాగిస్తుందా? అని మోడీ అన్నారు. జమ్మూకశ్మీర్,లడఖ్ విషయంలో దమ్ము ఉంటే ప్రతిపక్షాలు తమ ప్రభుత్వం తొలగించిన ఆర్టికల్ 370,35A ని తిరిగి ప్రవేశపెడతామని తమ మేనిఫెస్టోలో ఉంచాలని తాను సవాల్ చేస్తున్నానని మోడీ అన్నారు. మోడీ వ్యాఖ్యలు మహారాష్ట్రలో ఇవాళ ఎన్నికల ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ప్రత్యక్ష సవాల్ గా ఉన్నాయి. మహారాష్ట్రలోని 288 శాసనసభ స్థానాలకు అక్టోబర్-21,2019న ఎన్నికలు జరనున్నాయి. అక్టోబర్-24,2019న ఫలితాలు వెలువడనున్నాయి.

ఈ ఏడాది ఆగస్టులో జమ్మూకశ్మీర్ కు ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని మోడీ సర్కార్ రద్దు చేసిన విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్ ని అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా,లడఖ్ ని అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతగా  పునర్విభజించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై కాంగ్రెస్,ఏఐఏడీఎంకే,ఆర్జేడీ,పీడీపీ,ఎన్సీ తదితర పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కశ్మీరీల మనోభావాలను గౌరవించకుండా మోడీ సర్కార్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని విమర్శిస్తున్న విషయం తెలిసిందే.