కరోనాను తరిమికొట్టడానికి మిగిలింది 30రోజులే..

కరోనాను తరిమికొట్టడానికి మిగిలింది 30రోజులే..

Updated On : March 14, 2020 / 5:04 PM IST

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న మహమ్మారి కరోనా నుంచి భారత్‌ను కాపాడుకోవడానికి కేవలం 30రోజుల సమయం మాత్రమే ఉంది. విదేశాల నుంచి స్థానికంగా వ్యాప్తించే దశను దాటిన ఇండియాకు రానున్న రోజులు మరింత కీలకం. తాజాగా శాస్త్రవేత్తలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 
ఈ వ్యాప్తిని దశలుగా కేటాయించి ఇక్కడితోనే ఆపేయాలని వ్యూహరచన చేస్తుంది. 

చైనాలోని వుహాన్‌ నగరంలో ప్రారంభమైన కరోనా వైరస్ తాజాగా భారత్‌లో కూడా చైనా పరిస్థితులు కనిపించే అవకాశం ఉందని భారత వైద్య పరిశోధన మండలి(ICMR) అభిప్రాయపడింది. ఈ వైరస్‌ వ్యాప్తి చైనాలో అనుసరించినట్లుగానే భారత్‌లో ప్రవర్తించే అవకాశం ఉందని ICMR డైరక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ వెల్లడించారు. COVID‌-19 వైరస్‌ సమూహవ్యాప్తి దశ చేరుకునేందుకు కేవలం 30రోజల సమయం మాత్రమే ఉందని తెలిపారు. 

ప్రస్తుతం ఉన్న అత్యంత కీలకదశలోనే వైరస్‌ తీవ్రతను అడ్డుకోగలిగితే రాబోయే రోజుల్లో సమూహవ్యాప్తికి చేరకుండా అడ్డుకోవచ్చన్నారు. వైరస్‌ బారిన పడిన వ్యక్తికి దూరంగా ఉండటం లేదా దాని ప్రభావం ఉన్న దేశాలకు ప్రయాణం చేయని వ్యక్తికి కూడా వైరస్‌ సోకడాన్ని సమూహ వ్యాప్తి దశగా అభివర్ణిస్తారు. 

4 దశల్లో వైరస్‌ విజృంభణ:
వైరస్‌ వ్యాప్తి ముఖ్యంగా 4 దశల్లో ఉంటుందని ICMR నిపుణులు తెలియజేశారు. మొదటి దశ-విదేశాలనుంచి ఈ ప్రాంతంలోకి ప్రవేశించడం, రెండో దశ- వైరస్‌ సోకిన వ్యక్తి నుంచి స్థానికంగా వ్యాప్తి చెందడం, మూడో దశ-సమూహవ్యాప్తి, కాగా నాలుగో దశలో మహమ్మారిగా మారడం జరుగుతుంది. ఇలా 4 దశల్లో వైరస్‌ వ్యాప్తి ఉంటుందని, ప్రస్తుతం భారత్‌ రెండో దశలోనే ఉన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. 

ఈ దశలోనే వైరస్‌ వ్యాప్తిని కచ్చితంగా అరికట్టగలిగితేనే మూడో దశకు చేరకుండా ఉండగలం. లేనట్లయితే, మూడో దశను ఎదుర్కొంటున్న ఇటలీ, చైనా, అమెరికా, యూరప్‌ లాంటి పరిస్థితే ఇండియాకు వస్తుందని అంచనా వేస్తున్నారు. ఆ దశకు చేరడం అనివార్యమైనప్పటికీ ప్రస్తుతం దాని నుంచి తప్పించుకోవడానికి ఇంకా అవకాశముందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్వక్తం చేస్తున్నారు. 

ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలు, సినిమా థియేటర్లు మూసివేయడం వంటి చర్యలు సమూహవ్యాప్తిని అరికట్టగలవని సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు పరిశీలిస్తే, సమూహవ్యాప్తి దశ అనివార్యమైనప్పటికీ నాలుగోదశను చేరకుండా ఉండేదుకు శాస్త్రవేత్తలు నిరంతర కృషి చేస్తున్నారు. ఇప్పటికే వైరస్‌జాతిని గుర్తించిన శాస్త్రవేత్తలు వాక్సిన్‌ అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తున్నారు.