నాకు కరోనా వైరస్ లేదు..భారత్‌ తీసుకెళ్లండి : జ్యోతి రెండో సెల్ఫీ వీడియో

చైనా నుంచి కర్నూలు జిల్లా యువతి జ్యోతి మరో సెల్ఫీ వీడియోను విడుదల చేసింది. ఇప్పటి వరకూ తనకు ఎలాంటి వైరస్ లక్షణాలూ బయటపడలేదని తెలిపింది.

  • Published By: veegamteam ,Published On : February 7, 2020 / 09:46 AM IST
నాకు కరోనా వైరస్ లేదు..భారత్‌ తీసుకెళ్లండి : జ్యోతి రెండో సెల్ఫీ వీడియో

Updated On : February 7, 2020 / 9:46 AM IST

చైనా నుంచి కర్నూలు జిల్లా యువతి జ్యోతి మరో సెల్ఫీ వీడియోను విడుదల చేసింది. ఇప్పటి వరకూ తనకు ఎలాంటి వైరస్ లక్షణాలూ బయటపడలేదని తెలిపింది.

చైనా నుంచి కర్నూలు జిల్లా యువతి జ్యోతి మరో సెల్ఫీ వీడియోను విడుదల చేసింది. ఇప్పటి వరకూ తనకు ఎలాంటి వైరస్ లక్షణాలూ బయటపడలేదని తెలిపింది. ఎలాంటి పరీక్షలు చేయకుండా చైనా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని పేర్కొంది. ఫిబ్రవరి 19న నా వీసా గడువు ముగుస్తుందని.. తనను స్వస్థలానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వీడియోలో అర్థించింది. టెంపరేచర్‌ ఎక్కువగా ఉండటంతో జ్యోతిని చైనా అధికారులు భారత్‌కు పంపడం లేదు. 

కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామానికి చెందిన అన్నెం జ్యోతికి క్యాంపస్ సెలక్షన్స్‌లో ఉద్యోగం వచ్చింది. శిక్షణ కోసం చైనాకు వెళ్లింది. ఇంతలో కరోనా వైరస్ కలకలం మొదలైంది. వూహాన్ పట్టణంలో చిక్కుకుపోయిన జ్యోతిని ఇండియాకు తరలించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అయితే విమానం ఎక్కే సమయంలో జ్యోతిని పరీక్షించగా.. ఆమె శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే ఒక డిగ్రీ ఎక్కువగా ఉండటంతో కరోనా వైరస్‌ అనుమానిత కేసుగా భావించి ఆమె ప్రయాణాన్ని చైనా అధికారులు అడ్డుకున్నారు.

అన్నెం జ్యోతికి వారి సమీప బంధువు, మహానంది మండలం తమ్మడపల్లెకి చెందిన అమర్‌నాథ్‌రెడ్డితో వివాహం నిశ్చయమైంది. గత ఏడాది జూన్‌ 23న నిశ్చితార్థం జరిగింది. చైనా నుంచి తిరిగి వచ్చాక వివాహం నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి 14, 15వ తేదీన ముహుర్తాన్ని ఖరారు చేసుకున్నారు. రెండు కుటుంబాల వారు జ్యోతిని స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

మరోవైపు జ్యోతి కోసం రోధిస్తూ ఆమె తల్లి ప్రమీలాదేవి ఆరోగ్యం క్షీణిస్తోంది. నా కూతురు ఆరోగ్యంగా ఉన్నా కూడా ఎందుకు ఇండియాకు తీసుకురావట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని జ్యోతిని స్వదేశానికి తీసుకురావాలని కోరుతోంది. 

ఇటు జ్యోతి కుటుంబాన్ని మాజీ మంత్రి అఖిలప్రియ పరామర్శించారు. చైనా దేశం వూహాన్‌లో ఉన్న జ్యోతితో అఖిలప్రియ వీడియో కాల్‌ ద్వారా మాట్లాడారు. జ్యోతిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు. జ్యోతి త్వరలోనే ఇండియా వచ్చేలా కృషి చేస్తామని అఖిలప్రియ అన్నారు.