రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు నోటీస్

రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం అత్యంత వివాదాస్పదంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి రావడం ఆ తర్వాత జరిగిన పరిణామాలు కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ను పదవి నుండి తప్పించిన తీరును తన సినిమాలో చూపించబోతున్నట్లుగా చెబుతున్న వర్మ ఈ చిత్రంలో ‘ధగ ధగ కుట్ర…’ అనే పాట పెట్టాడు. తాజాగా ఆ పాటను విడుదల చేయడం జరిగింది. ఆ పాటలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును తీవ్రంగా విమర్శించినట్లు ఉందని తెలుగు దేశం పార్టీ నాయకులు ఆగ్రహంతో ఉన్నారు.
తెలుగు దేశం పార్టీ వారి మనో భావాలను దెబ్బ తీసే విధంగా పాట ఉందని పిఠాపురం ఎమ్మెల్యే హైకోర్టును ఆశ్రయించాడు. చంద్రబాబు నాయుడును చెడుగా చూపిస్తూ ఆ పాటను వర్మ విడుదల చేశాడని వెంటనే పాటను తొలగించడంతో పాటు దర్శకుడు వర్మపై కఠిన చర్యలకు ఆదేశించాలంటూ ఎమ్మెల్యే కోర్టులో పిటీషన్ దాఖలు చేయడం జరిగింది.
ఎమ్మెల్యే పిటీషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్ర నిర్మాతకు నోటీసులు పంపడం జరిగింది. మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని పాటకు సంబంధించి చిత్ర యూనిట్ సభ్యులు కోర్టులో హాజరవ్వాలంటూ కోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి ఈ నోటీసులకు వర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి.