Naga Vamsi : సీఎం కామెంట్స్ పై దిల్ రాజు వచ్చాక మీటింగ్ పెట్టుకుంటాం..
సంక్రాంతి సినిమాలకు పెయిడ్ ప్రీమియర్స్ అవసరం లేదని అన్నారు నిర్మాత నాగవంశీ.

We will have a meeting on CM comments when Dil Raju comes says Naga Vamsi
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సీరియస్గా ఉన్న తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. తాను పదవిలో ఉన్నంత వరకు బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు ఉండదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై నిర్మాత నాగవంశీ స్పందించారు.
సంక్రాంతి సినిమాలకు పెయిడ్ ప్రీమియర్స్ అవసరం లేదన్నారు. తెల్లవారుజామున 4.30కి సినిమా పడితే చాలన్నారు. ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు అమెరికాలో ఉన్నారని, ఆయన వచ్చాక అందరం కలిసి డిసైడ్ చేసి మాట్లాడతామని చెప్పారు. ముందు దిల్ రాజు సినిమా విడుదల కానుందని ఆయన ఏం చేస్తారో చూడాలన్నారు.
చంద్రబాబుని, పవన్ కల్యాణ్ను కలుద్దామని ఎవరూ చెప్పలేదన్నారు. సినీ ఇండస్ట్రీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎప్పుడూ సపోర్టు ఉంటుందని ఫస్ట్ మీటింగ్లోనే పవన్ చెప్పారు. ఆ సపోర్ట్ అలాగే ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. డాకు మహారాజ్ ప్రెస్మీట్లో నాగవంశీ ఈ వ్యాఖ్యలు చేశారు.
బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘డాకూ మహారాజ్’ . సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై నాగవంశీ ఈ మూవీని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సోమవారం చిత్ర దర్శకుడు బాబీ, నిర్మాత నాగవంశీ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.