మహారాష్ట్రలో దంచి కొడుతున్న వర్షాలు…నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు

  • Published By: bheemraj ,Published On : July 4, 2020 / 08:59 PM IST
మహారాష్ట్రలో దంచి కొడుతున్న వర్షాలు…నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు

Updated On : July 4, 2020 / 9:23 PM IST

మహారాష్ట్రలో వర్షాలు దంచి కొడుతున్నాయి. వరుసగా రెండో రోజు కూడా వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముంబైలో నిన్నటి నుంచి ఎడ తెరపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటి మునిగాయి. ముంబైలోని హిండ్‌మట, పారెల్, దాదర్, కింగ్స్ సర్కిల్, సియాన్ వంటి పలు ప్రాంతాలు అడుగు నుంచి రెండడుగుల వరకూ నీటిలో చిక్కుకున్నాయి. శాంతాక్రుజ్, గొరెగావ్, మలద్, కాండివలి, బోరివలి, ఇతర పశ్చిమ ప్రాంత శివార్లలో కూడా వర్షాలు ముంచెత్తుతున్నాయి.

మరోవైపు రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. థానే, రత్నగిరి జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. పాల్ఘర్, ముంబై, తానే, రాయిగఢ్ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని కూడా తెలిపింది. తులే జిల్లాలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరింది. ప్రయాణానికి ఎటువంటి అవకాశం లేకపోయినా వాహనాలపై జనం బయటికి వచ్చి ఇబ్బందులు పడుతున్నారు.

వర్షాలతో శనివారం ఉదయం నుంచి ముంబై శివార్లు, థానేలో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దక్షిణ ముంబైలో ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ 66 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైనట్టు కొలబా వాతావరణ కేంద్రం తెలపగా, శాంతాక్రుజ్ వాతావరణ కేంద్రం 111.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు పేర్కొంది.
తీర ప్రాంతానికి దూరంగా ఉండాలని బ్రిహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలను అప్రమత్తం చేసింది. మరోవైపు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, బయటకు వచ్చే సాహసం చేయవద్దని ముంబై పోలీసులు సూచించారు.