జైల్లో ఉరి వేసుకున్న ఖైదీ కడుపులో సూసైడ్ నోట్..! పాలిథిన్ కవరులో బైటపడ్డ వైనం

Nashik prisoner : ఓ హత్యా నేరంలో నాసిక్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శిక్ష పూర్తి చేసుకుని మరికొన్ని నెలల్లోనే విడుదల కానున్న ఆ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు.
జైలు సిబ్బంది వేధిపులతోనే తాను ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని..చీటీలో రాసి తాను చనిపోయాక ఆ చీటి జైలు సిబ్బందికి కనిపిస్తే మాయం చేస్తారనే ఆలోచనతో ఆ సూసైడ్ నోట్ ను ఓ పాలిథిన్ కవర్ లో పెట్టి మింగేశాడు. ఆత్మహత్య చేసుకున్న తరువాత అతని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ కు తరలించగా..డాక్టర్లు పోస్ట్ మార్టం చేస్తుండగా ఆ సూసైడ్ నోట్ బైటపడింది.
మహారాష్ట్రకు చెందిన అస్గర్ అలీ మన్సూరీ అనే 31 ఏళ్ల ఖైదీ ఓ హత్యా నేరంలో నాసిక్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. శిక్ష అనుభవించిన అతడు మరి కొన్ని నెలల్లో విడుదల కాబోతున్నాడు. ఈ క్రమంలో గత బుధవారం (అక్టోబర్ 7,2020) జైలు గదిలో అస్గర్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
దీంతో అతని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా.. అతడి కడుపులో ఓ సూసైడ్ నోట్ బయటపడింది. పాలిథిన్ కవర్లో చుట్టిన ఆ సూసైడ్ నోట్లో తన చావుకు గల కారణాలను రాసుకొచ్చాడు..తన ఆత్మహత్యకు జైలు సిబ్బంది వేధింపులే కారణమని స్పష్టంగా ఆ లేఖలో పేర్కొన్నాడు. ఈ సంఘటనపై స్పందించిన అధికారులు విచారణకు ఆదేశించారు. చదవటం, రాయటం రాని అస్గర్ వేరే వ్యక్తి సహాయంతో ఆ సూసైడ్ నోట్ రాయించుకుని ఉంటాడని జైలు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం జైలు నుంచి విడుదలైన మరి కొంతమంది ఖైదీలు కూడా జైలు సిబ్బంది తమపై తీవ్రమైన వేధింపులకు పాల్పడుతున్నారని..దయచేసి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అధికారులతో పాటు ముంబై హైకోర్టుకు లేఖ రాశారు.