కాంగ్రెస్ పార్టీకి మరో షాక్.. అశోక్ చవాన్ రాజీనామా

కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ తాజాగా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.

కాంగ్రెస్ పార్టీకి మరో షాక్.. అశోక్ చవాన్ రాజీనామా

why Ashok Chavan quit congress full detail here

Updated On : February 12, 2024 / 5:09 PM IST

Ashok Chavan: సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఇండియా కూటమిలోని పార్టీలు ఒక్కొక్కటిగా బయటకు పోతున్నాయి. అటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలోనూ సీనియర్ నాయకులు పార్టీని వీడుతుండడం కాంగ్రెస్ ను కలవరపెడుతోంది. తాజాగా మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. బీజేపీతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారని, రాజ్యసభ టికెట్ లభించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

అశోక్ చవాన్ ప్రస్తుతం భోకర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్‌ను కలిసి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. పీసీసీ అధ్యక్షుడు నానా పటోలేతో విభేదాల కారణంగానే చవాన్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అభ్యర్థులపై ఎంపిక వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు ఉన్నట్టు తెలుస్తోంది.

మరికొన్ని నెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీనియర్ నాయకుల రాజీనామాలు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారనున్నాయి. సీనియర్ నేత మిలింద్ దేవరా గత నెలలో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలోని శివసేనలో చేరిపోయారు. ముంబైలో కాంగ్రెస్ ముస్లిం ఫేస్‌గా పేరుగాంచిన మాజీ మంత్రి బాబా సిద్ధిక్ కూడా కాంగ్రెస్ పార్టీని వీడి అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీలోకి వెళ్లారు.

Also Read: ఎన్డీఏ జైత్రయాత్రకు కారణమేంటి.. ఎన్నికలకు ముందే గెలిచిన భావన ఎలా సాధ్యమైంది?

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శంకర్‌రావ్ చవాన్ కుమారుడైన అశోక్ చవాన్‌కు నాందేడ్ ప్రాంతంలో మంచి పట్టు ఉంది. ఆయన కాంగ్రెస్‌ను వీడడంతో రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి నష్టం కలిగించే అవకాశముందని విశ్లేషకుల అంచనా. స్టూడెంట్ లీడర్‌గా కెరీర్ ప్రారంభించిన చవాన్.. కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో పదవులు పొందారు. పీసీసీ అధ్యక్షుడు, సీడబ్ల్యూసీ సభ్యుడి పదవులతో పాటు రెండు సార్లు నాందేడ్ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. అలాగే మహారాష్ట్ర శాసనసభ, శాసనమండలిలో సభ్యుడిగానూ ఉన్నారు. 2008లో ఉగ్రవాద దాడి తర్వాత విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌ పదవి నుంచి దిగిపోవడంతో ముఖ్యమంత్రిగా చవాన్ బాధ్యతలు చేపట్టారు. ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణంలో ఆరోపణలు రావడంతో 2010లో సీఎం పదవిని వదులుకున్నారు.

Also Read: బలపరీక్షలో నెగ్గిన బీహార్ సీఎం నితీశ్ కుమార్