జాతీయ రాజకీయాల వైపు కేసీఆర్ చూపు

KCR enter in national politics ? : జాతీయ రాజకీయాల వైపు కేసీఆర్ అడుగులేస్తున్నారా.. బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్నారా… అంటే అవుననే సంకేతాలిచ్చారు గులాబీ బాస్. దేశానికి కొత్త దిశ, దశ చూపించాల్సిన టైం వచ్చిందంటూ ఆయన చేసిన కామెంట్స్.. నేషనల్ పాలిటిక్స్ను దృష్టిలో ఉంచుకునే అంటున్నారు విశ్లేషకులు. మరి కేసీఆర్ మనసులో ఏముంది.. డిసెంబర్ రెండో వారం తర్వాత ఏం జరగబోతోంది…?
రెండో సారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణలో తనయుడు కేటీఆర్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టి తాను జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలని చూస్తున్నట్లు చాలా రోజులుగా తెలంగాణ రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతుంది. టీఆర్ఎస్ నేతలు కూడా కేసీఆర్ ప్రధాని కావడానికి, కేటీఆర్ ముఖ్యమంత్రి కావడానికి అర్హతలు ఉన్నాయంటూ తరచూ వ్యాఖ్యానిస్తుంటారు.
నిజానికి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన తర్వాత కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్లాలని ఆలోచించారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా పని చేస్తున్నాయని, రాష్ట్రాలపై పెత్తనం చేలాయిస్తున్నాయనేది కేసీఆర్ మొదటి ఆరోపణ. అధికారాలు అన్నీ కేంద్రం వద్దే పెట్టుకుంటోందని, గ్రామ స్థాయి అంశాలకు సంబంధించినవి కూడా కేంద్రం వద్ద అధికారాలు ఉండటం ఏంటనేది కేసీఆర్ రెండో ఆరోపణ.
https://10tv.in/kcr-about-telangana-movie-theatres/
జీహెచ్ ఎంసీ ఎన్నికల వేళ గులాబీ బాస్ మరోసారి జాతీయ రాజకీయాల వైపు దృష్టి పెట్టారు. బీజేపీ వంచన రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపిస్తున్న కేసీఆర్.. ప్రాంతీయ పార్టీలను కలుపుకుని బీజేపీపై యుద్ధం ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు. గ్రేటర్ ఎన్నికల కోసం టీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేసిన కేసీఆర్… జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలిచ్చారు. కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలపై ఫైరయ్యారు.
దేశానికి కొత్త దశ, దిశ చూపాల్సిన అవసరం ఉందన్నారు కేసీఆర్. కొత్త రాజకీయాలకు తానే ఆవిష్కర్తనవుతానంటూ క్లారిటీ ఇచ్చారు. దేశ ప్రయోజనాల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని ప్రకటించారు. దేశాన్ని పాలించిన 2 పార్టీలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయంటూ బీజేపీ, కాంగ్రెస్ను టార్గెట్ చేశారు కేసీఆర్.
మొన్నటికి మొన్న కేబినెట్ భేటీ తర్వాత కూడా డిసెంబర్ రెండో వారంలో ప్రాంతీయ పార్టీల నేతలతో కలిసి సమావేశం నిర్వహించనున్నట్లు కేసీఆర్ వెళ్లడించారు. కేంద్రం అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలపై పీకల్లోతు ఆగ్రహంతో ఉన్నారు కేసీఆర్. ఇదే ఎజెండాగా జాతీయ రాజకీయాల్లోకి కాలు పెట్టాలని ఆయన భావిస్తున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ విధానాలను, మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు కూటమి కట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికలకు ముందు.. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కూటమిని ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ ట్రై చేశారు. వివిధ రాష్ట్రాల సీఎంలతో.. జాతీయ స్థాయి నేతలతో సమావేశాలు నిర్వహించారు. కుమారస్వామి, శరద్ పవర్, మమత బెనర్జీ, కేజ్రీవాల్, పినరాయ్ విజయన్, స్టాలిన్, అఖిలేష్ యాదవ్, నవీన్ పట్నాయక్ లాంటి నేతలతో భేటీ అయ్యారు. మిగతా పార్టీల నేతలతో కూడా మాట్లాడాలని భావిస్తున్నారు. డిసెంబర్ 2వ వారంలో హైదరాబాద్లోనే ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేసేందుకు సిద్ధవుతున్నారు.