Ind Vs SL : పింక్ బాల్ టెస్ట్.. భారత్ 252 ఆలౌట్.. శ్రేయస్ సూపర్ ఇన్నింగ్స్
బెంగళూరు వేదికగా శ్రీలంకంతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో(పింక్ బాల్ టెస్ట్) తొలి రోజే భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది.

Ind Vs Sl (1)
Ind Vs SL : బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో(పింక్ బాల్ టెస్ట్-డే/నైట్) తొలి రోజే భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. లంక స్పిన్నర్లు విజృంభించడంతో 59.1 ఓవర్లలో 252 పరుగులకే భారత్ ఆలౌట్ అయ్యింది. కఠినమైన పిచ్ పై శ్రేయస్ అయ్యర్ అదరగొట్టాడు. 98 బంతుల్లో 92 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతడి ఇన్నింగ్స్ లో 4 సిక్సులు, 10 ఫోర్లు ఉన్నాయి. కాగా, సెంచరీ చేసే చాన్స్ మిస్ చేసుకున్నాడు.
రిషబ్ పంత్ (39), హనుమ విహారి (31) ఫర్వాలేదనిపించారు. రోహిత్ శర్మ(15), మాయంక్ అగర్వాల్(4), విరాట్ కోహ్లి(23), రవీంద్ర జడేజా(4), అశ్విన్(13) రాణించలేకపోయారు. లంక బౌలర్లలో లసిత్ ఎంబుల్దెనియా, ప్రవీణ్ జయవిక్రమ చెరో మూడు వికెట్లు తీశారు. ధనంజయ డి సిల్వా రెండు వికెట్లు, సురంగ లక్మల్ ఒక వికెట్ తీశారు.
తొలి సెషన్లో 93 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ ను రెండో సెషన్లో శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (39) ఆదుకున్నారు. వీరిద్దరూ పోటాపోటీగా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ టీ20 మ్యాచ్ తరహాలో ఆడాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఎంబుల్దేనియా వేసిన 35 ఓవర్లో మూడు ఫోర్లు బాదిన అయ్యర్.. ధనుంజయ వేసిన 48 ఓవర్లో రెండు సిక్సర్లు బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
Women’s World Cup 2022 : వెస్టిండీస్పై భారత్ ఘన విజయం..చెలరేగిన స్మృతి, హర్మన్ ప్రీత్
పంత్ కూడా క్రీజులో ఉన్నంత సేపు దూకుడుగానే ఆడాడు. ధనుంజయ వేసిన 30వ ఓవర్లో పంత్ వరుసగా రెండు ఫోర్లు బాదాడు. జయవిక్రమ వేసిన తర్వాతి ఓవర్లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. మంచి ఊపుమీదున్న పంత్ని ఎంబుల్దేనియా పెవిలియన్ పంపాడు.
తర్వాత క్రీజులోకి వచ్చిన గత మ్యాచ్ హీరో రవీంద్ర జడేజా (4) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. జడేజాను కూడా ఎంబుల్దేనియానే ఔట్ చేశాడు. రవిచంద్రన్ అశ్విన్ (13)ను ధనుంజయ పెవిలియన్కి పంపగా.. అక్షర్ పటేల్ (9) లక్మల్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. జయవిక్రమ బౌలింగ్లో షమి (5) ధనుంజయకు చిక్కాడు. జయవిక్రమ వేసిన 59.1వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయిన శ్రేయస్ స్టంపౌటయ్యాడు. దీంతో 252 పరుగులకు టీమిండియా ఆలౌట్ అయ్యింది.
భారత్ ఇప్పటివరకు మూడే పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ లు ఆడింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య 2015 నవంబర్ 27-డిసెంబర్ 1 వరకు తొలి పింక్ బాల్ టెస్ట్ (డే/నైట్) జరిగింది. అందులో ఆసీస్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 18 టెస్టులు జరిగాయి. మార్చి 12 నుంచి 16వ తేదీ వరకు భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న బెంగళూరు టెస్టు అంతర్జాతీయంగా 19వ మ్యాచ్. రికార్డుపరంగా చూసుకుంటే… ఆస్ట్రేలియానే ఎక్కువ మ్యాచ్లను గెలిచింది. పది టెస్టులకుగాను పదింటిలోనూ విజయం సాధించడం విశేషం. టీమిండియాకు మాత్రం ఇది నాలుగో డే/నైట్ టెస్టు. మిగతా మూడు మ్యాచుల్లో భారత్ రెండు విజయాలు, ఒక ఘోర ఓటమి చవిచూసింది.
శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పింక్ బాల్ టెస్టులోనూ గెలిచి క్లీన్స్వీప్ చేయాలని భారత్ భావిస్తోంది. మరోవైపు శ్రీలంక జట్టు భారత్ కంటే ముందే డే/నైట్ మ్యాచ్ ఆడటం విశేషం. 2017లోనే పాకిస్తాన్తో లంక పింక్ బాల్ టెస్టు ఆడింది. పాక్పై లంక 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటివరకు లంక కూడా మూడే పింక్ బాల్ టెస్టులు ఆడింది. ఇరు జట్లకూ ఇది నాలుగోది కావడం.. సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉండటం ఆసక్తి నెలకొంది. స్పిన్నర్లకు అనుకూలంగా రూపొందించిన పిచ్ పై లంక బౌలర్లు చెలరేగారు.