ODI World Cup 2023, IND vs PAK Match: దాయాదుల మధ్య సమరం ఎప్పుడంటే..?
భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెండు దేశాల మధ్య ఉన్న అభిమానులే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
ODI World Cup 2023, IND vs PAK Match: ఐసీసీ వన్డే వరల్డ్కప్ 2023(ODI World Cup 2023) మన దేశంలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్లో వన్డే ప్రపంచకప్ను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా టోర్నీ షెడ్యూల్ ఖరారు అయినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ షెడ్యూల్ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) ఇంకా వెల్లడించలేదు. ఐపీఎల్ ముగిసిన తరువాత ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ను వెల్లడించే అవకాశం ఉంది.
అందుతున్న నివేదికల ప్రకారం అక్టోబర్ 5న వన్డే ప్రపంచకప్ ఆరంభం కానుంది. గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా 2019 విజేత అయిన ఇంగ్లాండ్, రన్నరప్ న్యూజిలాండ్ తొలి మ్యాచ్లో తలపడనున్నాయి. టీమ్ఇండియా తన తొలి మ్యాచ్ను ఆస్ట్రేలియాతో ఆడనుందట. చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. ఇక ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ను నవంబర్ 19న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు.
దాయాదుల సమరం ఆ రోజునే..!
భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెండు దేశాల మధ్య ఉన్న అభిమానులే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆ రోజున కొందరు స్టూడెంట్స్ కాలేజీలకు డుమ్మా కొడితే, ఉద్యోగులు ఆఫీసులకు సెలవు పెట్టి మరీ మ్యాచ్ చూసేందుకు సిద్దం అవుతారు. ఇక వన్డే ప్రపంచకప్2023లో భారత్, పాక్లు ఏ రోజున తలపడనున్నాయి అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబరు 15న భారత్, పాకిస్థాన్లు తలపడనున్నాయట. ప్రస్తుతం జరగనున్న ఆసియా కప్తో సంబంధం లేకుండా టోర్నీ కోసం భారత్లో పర్యటించేందుకు పాకిస్థాన్ అంగీకరించినట్లు సమాచారం. ఇక ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు ఎప్పుడో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఐసీసీ టోర్నమెంట్లలోనే ఈ రెండు జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి.
భారత్లోని 12 వేదికలపై ప్రపంచకప్ జరగనుంది. అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్కతా, ఢిల్లీ, ఇండోర్, ధర్మశాల, గౌహతి, రాజ్కోట్, రాయ్పూర్, ముంబై ఉన్నాయి. మొహాలీ, నాగ్పూర్లు జాబితాలో లేవు. టోర్నీ సెమీఫైనల్కు ముంబైలోని వాంఖడే అతిథ్యం ఇవ్వొచ్చు. మొత్తం 48 మ్యాచ్లు 46 రోజుల పాటు జరగనున్నాయి.