జర్నలిస్టులకు కోహ్లీ విన్నపం: రోహిత్ శర్మని ఫోకస్ చేయొద్దు

సుదీర్ఘ కాల విరామం తర్వాత టెస్టుల్లోకి అడుగుపెట్టిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఒక్క మ్యాచ్లోనే శతకాల మోత మోగించాడు. కెరీర్లోనే బెస్ట్ ఐసీసీ టెస్టు ర్యాంకు సంపాదించుకోగలిగాడు. దీంతో రికార్డుల రారాజు కోహ్లీని ఫోకస్ చేసే వాళ్లు రూట్ మార్చుకుని రోహిత్ వైపు పరిగెడుతున్నారు. దీనిపై కెప్టెన్ స్పందించి రోహిత్ని ఫోకస్ చేయొద్దంటూ మీడియాకు సూచనలిచ్చాడు.
‘కమాన్, అతనికి ఓ బ్రేక్ ఇవ్వండి. అతను బాగా ఆడాడని మీకు తెలుసు. బ్యాటింగ్ను ఎంజాయ్ చేయనివ్వండి. టెస్టు క్రికెట్లో కాస్త సరదాగా ఆడనివ్వండి. రోహిత్ టెస్టు ప్రదర్శనపై ఫోకస్ ఆపేయండి. రోహిత్ బాగా ఆడుతున్నాడు. తొలి టెస్టు గేమ్లో చాలా ప్రశాంతంగా కనిపించాడు. ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న ఆటను ఇప్పుడు చూపిస్తున్నాడు’ అని కోహ్లీ మీడియాకు వివరించాడు.
ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్లో భాగంగా భారత్.. వెస్టిండీస్తో తలపడి 120పాయింట్లు దక్కించుకుంది. ఫస్ట్ ఎడిషన్లో విదేశీ గడ్డలపై తలపడే ప్రతి జట్టు డబుల్ పాయింట్లు దక్కించుకోవాలని ఆకాంక్షిస్తున్నానని కోహ్లీ అన్నాడు. మూడు టెస్టుల సిరీస్లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 1-0తేడాతో విజయం సాధించింది. రెండో టెస్టును అక్టోబరు 10న పూణెలో, మూడు టెస్టును అక్టోబరు 19న రాంచీలో జరగనున్నాయి.