Telangana Congress : ప్రతి ఒక్కరి ఖాతాలో 15లక్షలు వేస్తామన్న ప్రధాని మోదీ హామీ ఏమైంది? కాంగ్రెస్ ఫైర్
Damodar Raja Narasimha Slams Modi : ఎన్నికల్లో కులాలను ఎలా ఉపయోగించాలని చూస్తున్నారు? కాంగ్రెస్ ను పడగొట్టాలని మోదీ చూస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ప్రత్యర్థులపై విమర్శలు ఎక్కుపెట్టింది. బీజేపీ, ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించింది. ఎమ్మార్పీఎస్ విశ్వరూప గర్జన సభలో కాంగ్రెస్ ను ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన విమర్శలకు ఆ పార్టీ కౌంటర్ ఇచ్చింది. హైదరాబాద్ గాంధీభవన్ లో కాంగ్రెస్ నాయకులు ఓ వీడియోను ప్రదర్శించారు.
అమితాబ్ ని మించిన మహా నటుడు మోదీ..
అవినీతి సొమ్మును ప్రతి రూపాయి పేదలకు పంపిణీ చేస్తామని ప్రధాని మోదీ ఇచ్చిన హామీ వీడియోను ప్రదర్శించారు. దేశంలోని ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేస్తామంటూ మోదీ ఇచ్చిన హామీ ఏమైందని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. అమితాబ్ ని మించిన మహా నటుడు మోదీ అని ఈ వీడియో రూపొందించింది కాంగ్రెస్. ఈ వీడియో ప్రదర్శన సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ మాట్లాడారు. ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు.
ప్రధాని మోదీ పచ్చి అబద్దాలు మాట్లాడారు..
75ఏళ్లలో దళితులను కాంగ్రెస్ అవమానించిందని మోదీ అన్నారు. అసలు ఎప్పుడూ దళితుల క్షేమాన్ని కాంగ్రెస్ కోరలేదని పచ్చి అబద్దం మాట్లాడారు. అంబేద్కర్ మేధస్సును గుర్తించిందే కాంగ్రెస్. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ చేసిందే కాంగ్రెస్. అలాంటి కాంగ్రెస్ ను పట్టుకుని దళితులను అవమానించింది అని అనడం సముచితం కాదు. అనేక మందికి అనేక అవకాశాలు ఇచ్చిన పార్టీ, దళితులను గుర్తించిన పార్టీ కాంగ్రెస్.
Also Read : వచ్చేది మళ్లీ మా ప్రభుత్వమే.. ఇంతకు ఇంత అనుభవిస్తారు.. వాళ్లకు కేటీఆర్ సీరియస్ వార్నింగ్
చిన్న రాజ్యాంగ సవరణ చేస్తే చాలు..
ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు. చిన్న రాజ్యాంగ సవరణ చేస్తే వర్గీకరణ జరుగుతుందని నాటి కమిటీ తేల్చింది. అది చేయకుండా మళ్ళీ కమిటీ వేస్తాం అంటే ఎలా? ఎన్నికల్లో కులాలను ఎలా ఉపయోగించాలని చూస్తున్నారు? కాంగ్రెస్ ను పడగొట్టాలని మోదీ చూస్తున్నారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడే రిజల్యూషన్ పాస్ చేసింది.
కాళేశ్వరం కుంగిపోతే ఒక్క మాట మాట్లాడరు..
కాస్ట్ సెన్సెస్ కు మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటివరకు మీరు కులాల వారిగా ఎన్ని ఇళ్లు కట్టించారు. కాళేశ్వరం కుంగిపోతే దాని గురించి ఒక్క మాట మాట్లాడరు. కేవలం ఓట్ల విభజన కోసం చూస్తున్నారు. కాంగ్రెస్ వైపు దళితులు ఉన్నారు. దళితులు, మాదిగలు అన్నీ గమనిస్తున్నారు” అని దామోదర రాజనర్సింహ అన్నారు.
Also Read : నన్ను చంపేందుకు కుట్ర, నాపై దాడి చేసింది వారే- గువ్వల బాలరాజు సంచలన వ్యాఖ్యలు