Ishan Kishan : క్రికెట్కు ఇషాన్ కిషన్ దూరం..? మళ్లీ బ్యాట్ పట్టుకోడా..!
టీమ్ఇండియా యువ ఆటగాడు, వికెట్ కీపర్ అయిన ఇషాన్ కిషన్ తన క్రికెట్ కెరీర్కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
Ishan Kishan : టీమ్ఇండియా యువ ఆటగాడు, వికెట్ కీపర్ అయిన ఇషాన్ కిషన్ తన క్రికెట్ కెరీర్కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కొంతకాలం పాటు ఆటకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. ఇదే విషయాన్ని అతడు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చెప్పగా.. ఇందుకు బోర్డు కూడా అనుమతి ఇచ్చింది. దీంతో అతడు దక్షిణాఫ్రికాతో రెండు టెస్టు మ్యాచుల సిరీస్ నుంచి తప్పుకున్నాడట. ఇషాన్ కిషన్ ఇలా అర్థాంతంగా ఆట నుంచి విరామం ఎందుకు తీసుకున్నాడనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. అతడు మానసికంగా అలసిపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆ వార్తల సారాంశం.
2021లో టీ20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఇషాన్ అదే ఏడాది వన్డేల్లోనూ అరంగ్రేటం చేశాడు. అయితే.. అతడికి ఎక్కువ అవకాశాలు రాలేదు. గతేడాది డిసెంబర్ లో రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో ఇషాన్కు వరుస అవకాశాలు లభించాయి. వాటిని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. వన్డేల్లో ద్విశతకం బాదిన అతడు, టీ20ల్లోనూ నిలకడగా బ్యాటింగ్ చేశాడు.
ఈ ఏడాది భారత్ ఆడిన ప్రతి సిరీస్లోనూ ఇషాన్ జట్టుతోనే ఉన్నాడు. అయితే.. శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ లు గాయాల నుంచి కోలుకుని టీమ్లోకి రావడంతో ఇషాన్ ఎక్కువగా బెంచీకే పరిమితం అయ్యాడు. ఈ క్రమంలోనే అతడు తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లుగా తెలుస్తోంది.
‘మానసికంగా చాలా అలసిపోయినట్లుగా మేనేజ్మెంట్ దృష్టికి ఇషాన్ తీసుకెళ్లాడు. ఆటకు కాస్త విరామం ఇవ్వాలని భావిస్తున్నట్లుగా చెప్పాడు. ఈ క్రమంలోనే టెస్టు సిరీస్ నుంచి తప్పించాలని అడిగాడు. అతడి పరిస్థితిని అర్థం చేసుకున్న మేనేజ్మెంట్ అందుకు అతడికి అనుమతి ఇచ్చినట్లు’ ఓ బీసీసీఐ అధికారి తెలిపినట్లు ఓ ఆంగ్ల మీడియా తన కథనంలో తెలిపింది.
ఇషాన్ స్థానంలో కేఎస్ భరత్..
డిసెంబర్ 26 నుంచి దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న రెండు టెస్టు మ్యాచుల సిరీస్ కోసం భారత జట్టును ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. మొదట ప్రకటించిన జట్టులో ఇషాన్ కిషన్కు స్థానం లభించింది. అయితే.. అతడు విరామం కోరడంతో అతడి స్థానంలో తెలుగు ఆటగాడు కేఎస్ భరత్కు అవకాశం లభించింది. ఇప్పటికే గాయాల కారణాల మహ్మద్ షమీతో పాటు రుతురాజ్ గైక్వాడ్లు టెస్టు సిరీస్కు దూరం అయిన సంగతి తెలిసిందే.
Mumbai Indians : ముంబై ఇండియన్స్కు కొత్త తలనొప్పి..! మళ్లీ రోహిత్ను బతిమిలాడుకోవాల్సిందేనా?
ఇదిలా ఉంటే.. ఇషాన్ కిషన్ ఎంతకాలం పాటు ఆటకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు అనే విషయం మాత్రం తెలియరాలేదు.
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు భారత జట్టు ఇదే : రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జస్ ప్రీత్ బుమ్రా, ప్రసిద్ కృష్ణ