అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం : ముగ్గురు హైదరాబాదీలు దుర్మరణం

  • Published By: chvmurthy ,Published On : February 25, 2020 / 11:57 AM IST
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం : ముగ్గురు హైదరాబాదీలు దుర్మరణం

అమెరికాలోని టెక్సాస్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారత  కాలమానం ప్రకారం  ఈ ప్రమాదం ఆదివారం సాయంత్రం 6గంటల 40 నిమిషాలకు జరిగింది. ప్రమాదంలో ముగ్గురు  ప్రవాస భారతీయులు మృతి చెందారు. మరణించిన వారిని రాజా గవిని(41),అతని భార్య ఆవుల దివ్య(34), వారి కుటుంబ స్నేహితుడు ప్రేమ్ నాధ్  రామనాధం(42)గా గుర్తించారు. 

వీరు ప్రయాణిస్తున్న కారును వేరే కారు ఢీ కొట్టటంతో ఈప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనా స్ధలంలోనే ముగ్గురు ప్రాణాలు విడిచారు.మృతుల్లో రాజా,దివ్య హైదరాబాద్, ముషీరాబాద్ లోని గాంధీనగర్ కు చెందినవారు కాగా రామనాధం విజయవాడకు చెందినవారు.

రాజా దివ్య లు కుమార్తె రియాను వీరు డ్యాన్స్ క్లాస్ వద్ద  దింపి…తిరుగు ప్రయాణంలో తమ సొంత ఇంటిని పరిశీలించేందుకు విజయవాడకు చెందిన ప్రేమ్ నాధ్ రామనాధం ను తీసుకు వెళ్లారు. వీరు  డల్లాస్ నుంచి ప్రిస్కో వెళ్తుండగా  ఎఫ్ ఎం 423 ఇంటర్ సెక్షన్  వద్ద  లెఫ్ట్ టర్న్ తీసుకుంటుండగా ఎదురుగా వచ్చిన ట్రక్కు వీరి కారును ఢీ కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో దివ్య కారు నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 

నాలుగు సంవత్సరాల క్రితమే వారు టెక్సాస్ లో స్ధిర పడినట్లు తెలుస్తోంది.  కాగా ప్రమాదానికి కారణమైన ట్రక్ డ్రైవర్ మైనర్ అని తెలుస్తోంది.  అతడి వివరాలు వెల్లడించటానికి  అధికారులు ఒప్పుకోలేదు. అతడు కూడా గాయాలపాలయ్యడు. అతడిని.. స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.