Women Asia Cup 2022: మహిళల ఆసియా కప్ విజేత భారత్.. ఏడోసారి కప్పు గెలిచిన టీమిండియా
భారత మహిళా క్రికెట్ జట్టు ఆసియా కప్ సొంతం చేసుకుంది. శనివారం శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచులో అద్భుతంగా రాణించి విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్.. రెండింట్లోనూ అదరగొట్టింది. ఏడోసారి ఆసియా కప్ గెలుచుకుంది.
Women Asia Cup 2022: మహిళల క్రికెట్ ఆసియా కప్ విజేతగా నిలిచింది భారత్. శనివారం సిల్హట్లో శ్రీలంకతో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 66 పరుగుల లక్ష్యాన్ని 8.3 ఓవర్లలోనే చేధించి విజేతగా నిలిచింది.
మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంకను భారత బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. శ్రీలంక జట్టులో ఒక్కరు మినహా మరో బ్యాట్స్ఉమెన్ ఎవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేదంటే భారత బౌలర్లు ఎంతగా విజృంభించారో అర్థం చేసుకోవచ్చు. నిర్ణీత 20 ఓవర్లలో శ్రీలంక 9 వికెట్లు కోల్పోయి, 65 పరుగులు సాధించింది. శ్రీలంక తరఫున ఇనోకా రణవీర అత్యధికంగా 18 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో రేణకా సింగ్ 3 వికెట్లు తీసింది. తర్వాత రాజేశ్వరి గైక్వాడ్, స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం 66 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగింది భారత్. 8.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి, 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లక్ష్యం స్వల్పంగా ఉన్నప్పటికీ భారత్ స్టార్ క్రీడాకారిణి స్మృతి మంధాన అద్భుతంగా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ సాధించడం విశేషం.
Polar Bear: ఏం తెలివి! మంచు ఫలక పగలకుండా ఎలుగుబంటి ఏం చేసిందో చూడండి
స్మృతి మంధాన 25 బంతుల్లోనే 50 పరుగులు సాధించింది. ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడుతూ 51 పరుగులతో నాటౌట్గా నిలిచింది. భారత బ్యాటింగ్లో షెఫాలీ వర్మ (5), జెమీమీ రోడ్రిగెజ్ (2) పరుగులు సాధించి ఔటయ్యారు. అయితే, స్మృతి మంధానకు హర్మన్ ప్రీత్ అండగా నిలిచింది. హర్మన్ ఈ మ్యాచులో 11 పరుగులు సాధించి నాటౌట్గా నిలిచింది. దీంతో ఫైనల్ మ్యాచులో విజయం సాధించి భారత మహిళల జట్టు ఆసియా కప్ కైవసం చేసుకుంది. భారత జట్టు ఆసియా కప్ గెలవడం ఇది ఏడోసారి.