Pawan Kalyan : మీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు, జనం బాగుండాలంటే జగన్ పోవాలి- పవన్ కల్యాణ్
Pawan Kalyan : ఒకరిని దేహీ అని అడుక్కోవద్దు. అందరం కలిసి రాష్ట్ర హితం కోసం పని చేద్దాం.
Pawan Kalyan – Amanchi Swamulu : జగన్ సర్కార్ టార్గెట్ గా జనసేనాని పవన్ కల్యాణ్ చెలరేగిపోతున్నారు. ఛాన్స్ చిక్కితే చాలు ముఖ్యమంత్రి జగన్ పై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఆమంచి స్వాములు జనసేనలో చేరిక సందర్భంగా మరోసారి సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు పవన్ కల్యాణ్.
ప్రకాశం జిల్లాకు చెందిన ఆమంచి స్వాములు జనసేనలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు పవన్ కల్యాణ్. చీరాల నుంచి ఆమంచి స్వాములు జనసేనలో చేరడం చాలా సంతోషం అన్నారు పవన్ కల్యాణ్. నేను చీరాలలో పెరిగిన వాడినే అంటూ ఆ ప్రాంతంలో పేటల పేర్లు చదివారు పవన్ కళ్యాణ్.
ఆమంచి స్వాములును మనస్ఫూర్తిగా జనసేనలోకి ఆహ్వానిస్తున్నా అని పవన్ చెప్పారు. కార్యకర్తలకు అండగా నిలబడే నాయకుడు, కష్టం వస్తే నేను ఉన్నా అని నిలబడే వ్యక్తి ఆమంచి స్వాములు అని పవన్ కొనియాడారు. స్వాములు రాక ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో జనసేనకు బలం అన్నారు. ఆమంచి కుమారుడు రాజేంద్ర కూడా జనసేనలో చేరడం యువత మార్పుకు చిహ్నంగా పవన్ అభివర్ణించారు. రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం పోవాలని, అవినీతి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పవన్ అన్నారు.
”జనం బాగుండాలంటే జగన్ పోవాలి. కొంతమంది మాత్రమే కాదు అందరూ బాగుండాలనేది జనసేన సిద్దాంతం. మన హక్కులను మనం సాధించుకుందాం. ఒకరిని దేహీ దేహీ అని అడుక్కోవద్దు. అందరం కలిసి రాష్ట్ర హితం కోసం పని చేద్దాం. మీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు. ఎవడొస్తాడో ఇక నుంచి చూద్దాం. శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడి మీద పడిన దెబ్బ నా మీద పడినట్లే. ఆమంచి స్వాములు మీద దెబ్బపడినా నేను వెళతా. జనసేనకు జన బలం ఉంది. అన్ని జిల్లాల్లో వైసీపీ దౌర్జన్యాలను ఎదుర్కొందాం” అని జనసేన శ్రేణులకు పిలుపునిచ్చారు పవన్ కల్యాణ్.