Ambati Rambabu : జగన్ని ఓడించే నాయకుడే లేడు, లోకేశ్ ఎప్పటికీ లీడర్ కాలేడు- మంత్రి అంబటి రాంబాబు
ఇది పేదవాళ్లకు, పెత్తందార్లకు జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధంలో పేదవాళ్లదే విజయం. జగన్ దే గెలుపు.
![Ambati Rambabu : జగన్ని ఓడించే నాయకుడే లేడు, లోకేశ్ ఎప్పటికీ లీడర్ కాలేడు- మంత్రి అంబటి రాంబాబు Ambati Rambabu : జగన్ని ఓడించే నాయకుడే లేడు, లోకేశ్ ఎప్పటికీ లీడర్ కాలేడు- మంత్రి అంబటి రాంబాబు](https://10tv.in/wp-content/uploads/2023/11/Ambati-Rambabu-Slams-Pawan-Kalyan.jpg)
Ambati Rambabu
ప్రతిపక్ష నేతలపై నిప్పులు చెరిగారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ లపై విరుచుకుపడ్డారు. ఎంతమంది ఏకమైనా జగన్ ని ఏమీ చేయలేరని, జగన్ ని ఓడించే నాయకుడే లేడని అంబటి రాంబాబు అన్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. అభివృద్ది కార్యక్రమాలకు రాజానగరం నియోజకవర్గంకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారాయన. నిన్న మొన్నటి దాక సెంట్రల్ జైల్లో ఉండి ఆరోగ్యం బాగోలేదనే సాకుతో బయటకు వచ్చిన చంద్రబాబు.. మమ్మల్ని ఓడిస్తా అనడం కామెడీగా ఉందన్నారు.
Also Read : చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయటం జగన్ చేసిన అతి పెద్ద తప్పు, వైసీపీ ఫ్యాన్ ఆగిపోవడం ఖాయం : లోకేశ్
పవన్ కల్యాణ్ పార్టీ జనసేన కాదు చంద్రసేన అంటూ విమర్శలు గుప్పించారు అంబటి రాంబాబు. లోకేశ్ పాదయాత్ర చేసినా దూకుడు యాత్ర చేసినా ఎప్పటికీ నాయకుడు కాలేడని ఎద్దేవా చేశారు. సోదరులకు బదులు సౌదరులు అని పిలిచే వ్యక్తి ఎమ్మెల్యే ఎలా అవుతాడు? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో గ్లాసు గుర్తుపై 8 సీట్లలో పవన్ కల్యాణ్ పోటీ చేస్తే చంద్రబాబు కాంగ్రెస్ కు ఓటు వెయ్యమంటున్నారు. ఆంధ్రలో మాత్రం తెలుగుదేశానికి ఓటు వెయ్యమనడం నీతి, సిగ్గు లేని రాజకీయం అంటూ మండిపడ్డారు.
”దుష్టశక్తులంతా పిట్టల దొరల్లా డప్పులు వాయిస్తూ తిరిగినా, ఎంతమంది కలిసి వచ్చినా జగన్ ని ఓడించే నాయకుడు లేడు. ఇది పేదవాళ్లకు, పెత్తందార్లకు జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధంలో పేదవాళ్లదే విజయం. జగన్ దే గెలుపు. ప్రస్తుతం రాజా శాసనసభ్యుడు. భగవంతుడు, జగన్ కరుణిస్తే రేపు ఎన్నికల తర్వాత ఏమైనా కావచ్చు. నేను, జక్కంపూడి కుటుంబం జగనన్నను నమ్ముకున్న వ్యక్తులం. మేము చచ్చేంత వరకూ జగనన్నతోనే మా ప్రయాణం. వందల అభివృద్ది కార్యక్రమాలు చేసిన వ్యక్తి జగన్. పల్లకి మోయడానికి పవన్ సిద్ధంగా ఉన్నా కాపులు సిద్ధంగా లేరు” అని అంబటి రాంబాబు అన్నారు.
Also Read : సజ్జలకు హైకోర్టు నోటీసులు.. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం పిటీషన్పై విచారణ