కే.జీ.ఎఫ్ హీరోకు బెదిరింపులు: స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన యాష్
లోక్సభ ఎన్నికల వేళ కన్నడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సినీ నటి సుమలత.. కర్నాటకలోని మాండ్యా సీటు నుంచి పోటీ చేస్తుంది. కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ నటుడు అంబరీష్ చనిపోవడంతో ఆ స్థానం నుంచి సుమలత బరిలోకి దిగింది. కాంగ్రెస్ నుండి టిక్కెట్ ఆశించిన ఆమెకు టిక్కెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేస్తుంది. కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉండగా.. అందులో భాగంగా సీట్ల సర్దుబాటులో మాండ్య స్థానంను జేడీఎస్కు కేటాయించారు. ఈ స్థానం నుంచి సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ పోటీ చేస్తున్నారు.
సుమలత భర్త కన్నడ నటుడు అంబరీష్ మాండ్య జిల్లాలోనే జన్మించారు. 1994లో రాజకీయాల్లో అడుగు పెట్టిన ఆయన కాంగ్రెస్ తరపున పోటీచేసి ఎంపీగా గెలుపొందారు. 1998, 99, 2004లో మాండ్యకు ప్రాతినిథ్యం వహించారు. నటుడిగా, సమాజ సేవకుడిగా పేరు సంపాదించిన అంబరీష్కు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా చరిష్మా ఉంది. ఈ క్రమంలో కే.జీ.ఎఫ్ సినిమాతో దక్షిణాదిలో హిట్ కొట్టిన హీరో యాష్.. మరో స్టార్ హీరో దర్శన్లు ఆమెకు మద్దతుగా నిలిచారు. దర్శన్, యశ్లు అమెకు మద్దతు తెలుపుతూ ప్రచారం చేయడంపై జేడీఎస్ నాయకులు మండిపడుతున్నారు.
అందులో భాగంగానే దర్శన్, యశ్లకు బెదరింపులు మొదలయ్యాయి. సినిమా వాళ్లు తమ వైఖరిని ఇలాగే కొనసాగిస్తే తగిన గుణపాఠం చెబుతామని జేడీఎస్ ఎమ్మెల్యే నారాయణగౌడ అంటున్నారు. ‘నమ్మ కర్ణాటక రక్షణా వేదిక’ అధ్యక్షుడు జయరాజ్ నాయుడు ఇంకొక అడుగు ముందుకు వేసి వాళ్లు ప్రచారంలో పాల్గొంటున్నారు కనుక వారి సినిమాలను ఆడనివ్వకూడదంటూ ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేశారు. మర్యాద లేకుండా తమ నాయకుల పట్ల ఏమాత్రం అసభ్యంగా మాట్లాడినా గుణపాఠం తప్పదని జేడీఎస్ నాయకులు అంటున్నారు.
అయితే జేడీఎస్ నాయకుల వ్యాఖ్యలపై స్పందించిన యాష్.. మేము పాకిస్తాన్ నుంచి రాలేదని, ఒకే సినిమా ఇండస్ట్రీ కాబట్టి.. మా మధ్య మంచి రిలేషన్ ఉంటుందని, సుమలతకు సపోర్ట్ చేస్తానని అన్నారు. మాండ్యాలోని నీటినే నేను రోజు తాగుతున్నానని, ఈ గడ్డ మీద తింటున్న తిండికి రుణం తీర్చుకుంటున్నానని చెప్పారు. మాపై ఐటీ దాడులు చేస్తామంటూ బిదిరిస్తే భయపడం అంటూ ఆయన అన్నారు.