ఎన్‌కౌంటర్‌లో సైకో కిల్లర్ హతం.. పోలీసులకు గాయాలు!

  • Published By: vamsi ,Published On : December 4, 2020 / 10:04 AM IST
ఎన్‌కౌంటర్‌లో సైకో కిల్లర్ హతం.. పోలీసులకు గాయాలు!

Updated On : December 4, 2020 / 10:08 AM IST

సైకో కిల్లర్, కరుడుగట్టిన హంతకుడు దిలీప్‌ దేవాల్‌ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతం అయ్యాడు. గుజరాత్‌లోని దాహోద్‌కు చెందిన దిలీప్‌కు హత్యలు చేయడం వెన్నతో పెట్టిన విద్య. ఒంటరిగా ఉండే వృద్ధుల ఇళ్లను టార్గెట్‌ చేసి తన గ్యాంగ్‌తో కలిసి దొంగతనాలకి దిగే దండుపాళ్యం గ్యాంగ్ లాంటి గ్యాంగ్‌కు దిలీప్ లీడర్. దొంగతనాలకు సంబంధించిన సాక్ష్యాలు మాయం చేసే క్రమంలో ఇప్పటికే ఆరుగురిని చంపేశాడు దిలీప్ దేవాల్. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ సహా వివిధ రాష్ట్రాల్లో అతని పేరు మీద ఆరు హత్య, దోపిడీ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అతడు మానసిక రోగి ‘సీరియల్ కిల్లర్’ అని పోలీసులు ఇప్పటికే వెల్లడించారు.



మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో పోలీసులతో జరిగిన ఘర్షణలో దిలీప్ దేవాల్(38) చనిపోయాడు. కాల్పుల్లో ఐదుగురు పోలీసులు కూడా గాయపడ్డారు. నవండర్ నెలలో 25వ తేదీన దిలీప్‌ మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో చోరీకి పాల్పడ్డాడు. సెలూన్‌ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునే ఓ వ్యక్తి ఇటీవలే భూమి అమ్ముకుని కొంత డబ్బు ఇంట్లో ఉంచుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న దిలీప్‌ చోటీ దీవాళి రోజున తన గ్యాంగ్‌తో కలిసి వారింటికి వెళ్లాడు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు అడ్డుకోగా.. గోవింద్ సోలంకి (50), అతని భార్య శారదా (45), వారి కుమార్తె (21)ను తుపాకులతో కాల్చి చంపేశాడు.



అయితే ఈ సమయంలో వారి ఆర్తనాదాలు బయటివారికి, చుట్టుపక్కల జనాలకు వినపడకుంగా దీపావళి సంధర్భాన్ని వాడుకుని, భారీగా టపాకాయలు పేల్చాడు. అతని ముగ్గురు సహచరులు అనురాగ్, గౌరబ్ మరియు లాలా అప్పటికే పట్టుబడగా.. గోవింద ఇంట్లో సెలూన్ ఉండగా.. జుట్టు కత్తిరించే నెపంతో దిలీప్ చాలాసార్లు అక్కడికి వచ్చి ఇంటి పరిస్థితిని గమనించాడు. ఈ సంఘటన జరిగిన సమయంలో గోవింద భార్య శారదా సోలంకి టీవీ చూస్తున్నారు. ఆమెను మొదట కాల్చి చంపాడు.



అప్పటి నుంచి గాలింపు చర్యలు చేపట్టి దిలీప్‌ గ్యాంగ్‌లోని అనురాగ్‌ మెహర్‌(25), గౌరల్‌ బిల్వాల్‌(22), లాలా భాబోర్‌(20)లను అరెస్టు చేశారు. దిలీప్‌ను పట్టుకునేందుకు అప్పటి నుంచి ప్రయత్నించగా కాల్పులకు తెగబడడంతో ఎన్‌కౌంటర్ జరిగింది.