చార్జింగ్ లో పెట్టకుండానే పేలిన షావోమి స్మార్ట్ ఫోన్

చార్జింగ్ లో పెట్టిన సెల్ ఫోన్ లు పేలిన వార్తలు తరచూ వింటుంటాం. ఇలాంటి సంఘటనల్లో కొందరికి గాయాలై ఆస్పత్రి పాలయ్యారు. ఇప్పుడు చార్జింగ్ లో లేని సెల్ ఫోన్ పేలిపోయింది. కాకపోతే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా బాధితుడు తన సెల్ ఫోన్ పేలిన విషయాన్ని ట్విట్టర్ లో పంచుకోగా.. ఫోన్ లో ఎటువంటి సాంకేతిక లోపంలేదని కస్టమర్ తప్పిదంవల్లే ఇలా జరిగి ఉంటుందని చెప్పటం చర్చకు దారి తీసింది.
వివరాల్లోకి వెళితే ముంబైకి చెందిన ఈశ్వర్ చవ్హాన్ రెడ్మి నోట్ 7ఎస్ స్మార్ట్ఫోన్ అక్టోబర్లో ఫ్లిప్కార్ట్ ద్వారా కొనుగోలు చేసినట్లు ట్వీట్లో తెలిపారు. ఆఫీసులో ఉండగా ఫోన్ ను టేబుల్ మీద పెట్టి పని చేసుకుంటున్నారు. ఇంతలో ఏదో కాలుతున్న వాసన గమనించారు. వాసన ఎక్కడ నుంచి వస్తోందా అని చూడగా టేబుల్ మీద ఉన్న కొత్త షావోమి ఫోన్లో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఫోన్ ఛార్జింగ్లో లేదు’ అని చవ్హాన్ తెలిపారు. అంతేకాదు.. తన ఫోన్ ఎపుడూ కింద కూడా పడలేదని గుర్తు చేసుకున్నారు. వెంటనే ఆయన ఫోన్ ను థానేలోని షావోమి డీలర్ కు చూపించారు. ఐదు రోజుల తరువాత, బ్యాటరీలో కొంత సమస్య ఉందని కంపెనీ చెప్పిందని చవ్హాన్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. బ్యాటరీ లోపం, తయారీ లోపం వల్లే ఇలా జరిగి వుంటుందని ఆయన ఆరోపిస్తున్నారు.
అయితే షావోమీ స్పందిస్తూ..నాణ్యతకు, భద్రతకు అధిక ప్రాధాన్యత యిస్తామని, గత అయిదేళ్లుగా అభిమానులుతమ బ్రాండ్పై చూసిన అభిమానానికి ఇది నిదర్శనమని తెలిపింది. తాజా ఘటనను పరిశీలించిన తరువాత, బాహ్య పరిస్తితుల కారణంగానే నష్టం జరిగిందని తేల్చి పారేసింది. ‘కస్టమర్ ప్రేరిత నష్టం’ గా భావిస్తున్నట్టుగా పేర్కొంది.