విజయవాడ – గుంటూరులకు కొత్త రూపు

విజయవాడ – గుంటూరు జిల్లాలకు కొత్త రూపు రానుంది. సుస్థిరాభివృద్ధి నగరాల్లో ఏకీకృత విధానం పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక అయ్యింది. దేశంలో ఐదు నగరాలు ఎంపిక అయితే..అందులో రెండు ఏపీవే కావడం విశేషం. యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (యూఎన్ఐడీవో) అమలు చేస్తున్న సుస్థిరాభివృద్ధి నగరాల్లో ఏకీకృత విధానం పైలట్ ప్రాజెక్టుకు విజయవాడ, గుంటూరు ఎంపికయ్యాయి.
కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యూఎన్ హ్యాబిటాట్, జీఈఎఫ్ (గ్లోబల్ ఎన్విరాన్ మెంట్ ఫెసిలిటీ) సంస్థల భాగస్వామ్యంతో యూఎన్ఐడీవో ఈ పైలట్ ప్రాజెక్టును అమలు చేయనుంది. ఈ ఐదు నగరాల అభివృద్ధికి ప్రణాలికలు రూపొందించడం, అవసరమైన పెట్టబడులు, సామర్థ్యం పెంపు, నాలెడ్జ్ బదిలీ అంశాల్లో యూఎన్ఐడీవో ఈ కార్పొరేషన్లకు చేయూతనివ్వనుంది. మొదటి దశలో విజయవాడ, గుంటూరుల్లో సుస్థిరాభివృద్ధిస్థితి ఎలా ఉందో అధ్యయనం చేస్తుంది.
దీనిబట్టి విజన్ రూపొందించుకుని ప్రాధామ్యాలు నిర్దేశించుకుంటుంది. అనంతరం వాటిని అభివృద్ధి చేయడానికి ఉన్న వనరులు, ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ప్రాజెక్టును అమలు చేయనుంది. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో ప్రధానంగా మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, రవాణా నెట్ వర్క్ అభివృద్ధి, కాలుష్యాన్ని తగ్గించడం వంటి అంశాల్లో ఆర్థిక సహకారం అందించే అవకాశాలున్నాయి. రెండు రోజులుగా ఈ జిల్లాల్లో యూఎన్ఐడీవో ప్రతినిధి బృందం పర్యటిస్తోంది. సీఆర్డీఏ కమిషనర్తో సమావేశమై ఇక్కడి పరిస్థితులు, అవసరాలకు సంబంధించిన వివరాలు సేకరించింది.
Read More : న్యాయం కావాలి : రెవెన్యూ అధికారులపై రైతన్నల నిరసన