తుఫాన్ ముప్పు : ఏపీపై ఫణీ పడగ

  • Published By: madhu ,Published On : April 27, 2019 / 12:51 AM IST
తుఫాన్ ముప్పు : ఏపీపై ఫణీ పడగ

Updated On : April 27, 2019 / 12:51 AM IST

ఏపీకి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. హిందూ మహాసముద్రానికి అనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. రాగల 24 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అనంతరం ఏప్రిల్ 27వ తేదీ శనివారం రాత్రికి తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీలకంలోని ట్రింకోమలీకి 1140 కిలోమీటర్లు తూర్పు ఆగ్నేయంగా, చెన్నైకి 1490 కిలోమీటర్లు ఆగ్నేయంగా, మచిలీపట్నానికి 1760 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయంగా వాయుగుండం కేంద్రీకృతమైందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది మరింత బలపడి తుఫాన్‌గా మారనుందని చెప్పింది. శ్రీలంక తీరానికి వాయువ్య దిశగా కదులుతూ ఏప్రిల్ 30వ తేదీన ఉత్తర తమిళనాడు – దక్షిణ కోస్తాంధ్రల మద్య తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. 

తుఫాన్‌ ప్రభావంతో ఈ నెల 28 నుంచి కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురువనున్నాయి. మే 1వ తేదీన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీని కారణంగా తీరప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తాయి. తీరం దాటే నాటికి తీవ్రత మరింత పెరిగి, పెను గాలులు వీస్తూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో పాటు.. అలలు సాధారణం కంటే ఒక మీటర్‌ ఎగసిపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు రేపటిలోగా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు హెచ్చరించారు. 

ఇక ఈ తుఫానుకు బంగ్లాదేశ్‌ సూచించిన ఫణి పేరును ఖరారు చేయనున్నారు. దీనికి ముందు 2018 డిసెంబర్‌ మూడో వారంలో తుఫాను ఏర్పడింది. ఆ తుఫానుకు పెథాయ్‌ పేరును థాయ్‌లాండ్‌ సూచించింది. ఆ తర్వాత క్రమంలో బంగ్లాదేశ్‌ సూచించిన ఫణిని ప్రకటించనున్నారు. నిబంధనల ప్రకారం తుఫానుగా మారాకే పేరు పెడతారు. ఆ లెక్కన ఇప్పుడు ఏర్పడబోయే తుఫానుకు ఫణి అనే పేరును ఏప్రిల్ 27వ తేదీ శనివారం అధికారికంగా ప్రకటించనున్నారు.