ఆయిల్ ధరలు అందుకే పెరుగుతున్నాయి..మోడీ సర్కార్ పై గహ్లోత్ ఫైర్

ఆయిల్ ధరలు అందుకే పెరుగుతున్నాయి..మోడీ సర్కార్ పై గహ్లోత్ ఫైర్

Updated On : February 20, 2021 / 4:44 PM IST

ashok gehlot: దేశంలో రెండు వారాల నుంచి వరుసగా పెరుగుతున్న ఆయిల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఆయిల్ ధరలు పెరుగుతుండటంపై రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ శనివారం ట్విట్టర్​ వేదికగా కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు.

కేంద్రం తీసుకుంటున్న తప్పుడు ఆర్థిక నిర్ణయాల వల్లే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయని అశోక్‌ గహ్లోత్ అన్నారు. 2014 యూపీఏ హయాంలో ఎక్సైజ్‌ సుంకం లీటర్‌ పెట్రోల్‌పై రూ.9.20, డీజిల్‌పై రూ.3.46 మాత్రమే ఉంది. కానీ, మోడీ ప్రభుత్వంలో ఎక్సైజ్‌ సుంకం లీటరు పెట్రోల్‌పై రూ.32.90, డీజిల్‌పై రూ.31.80 విధిస్తోందన్నారు.

వెంటనే ఎక్సైజ్‌ సుంకాలను తగ్గించాలని అశోక్‌ గహ్లోత్ ట్వీట్ చేశారు. కేంద్రం రాష్ట్రాలపై అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ, ప్రత్యేక ఎక్సైజ్‌ డ్యూటీల భారం మోపుతోంది. ఫలితంగానే రాష్ట్రాలు ప్రజలపై వ్యాట్‌ విధించాల్సి వస్తోందని ‌ గహ్లోత్‌ తెలిపారు.

కరోనా కారణంగా రాజస్థాన్‌ ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయి.. ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నప్పటికీ సామాన్యుడికి ఉపశమనం కల్పించాలనే యోచనతో రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో రెండు శాతం వ్యాట్‌ను కుదించిందన్నారు. ఆ విధంగా ప్రజలకు ఉపశమనం కల్పించాల్సింది పోయి.. మోడీ ప్రభుత్వం ఏకధాటిగా ఇంధన ధరలను పెంచుకుంటూ పోతోందని అశోక్‌ విమర్శించారు.

ఇక, రాజస్థాన్‌ ప్రభుత్వం పెట్రోల్‌పై అధికంగా పన్నులు విధిస్తోందని వస్తున్న పుకార్లపై స్పందిస్తూ.. పెట్రోల్‌పై పన్నులు రాజస్థాన్‌లో కన్నా బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లోనే అధికంగా విధిస్తున్నారని విమర్శలు చేశారు.