బెజవాడలో చంద్రబాబు అరెస్ట్

అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్సుయాత్రను ప్రారంభించటానికి వెళ్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ బెంజిసర్కిల్ వద్ద అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఏర్పాటైన అనంతరం ఆటోనగర్ వద్దకు బస్సులను ప్రారంభించటానకి పాదయాత్రగా బయలు దేరిన చంద్రబాబును, వామపక్షనేతలను, జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదని, వెంటనే వెనక్కి వెళ్లాలని పోలీసులు సూచించారు.
తాము మాత్రం బస్సులు నిలిపివేసిన ప్రాంతానికి వెళతామని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. పోలీసులు మాత్రం అనుమతినివ్వకపోవడంతో బాబు రోడ్డుపై బైఠాయించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్, తెలుగు తమ్ముళ్లు భారీగా చేరుకున్నారు. బాబు దగ్గరకు వెళ్లేందుకు లోకేష్ ప్రయత్నించారు. దీనిని పోలీసులు అభ్యంతరం చెప్పారు. ఈ సందర్భంగా పోలీసులపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బెంజిసర్కిల్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి.
పోలీసులతో కొంత సేపు వాగ్వివాదం జరిగిన తర్వాత చంద్రబాబు, లోకేష్తో సహా ఇతర నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ, వామపక్ష, ఇతర జేఏసీ నేతలను పోలీసులు అరెస్టు చేసి వాహనంలో తరలించటానికి ప్రయత్నించగా. వీరిని తీసుకువెళ్తున్న పోలీసు వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. జేఏసీ ఆఫీసు వద్ద ఉద్రిక్త పరిస్ధితి కొనసాగుతోంది.