ఆ పథకాన్ని ముట్టుకుంటే ముఖ్యమంత్రి మసే..! హైదరాబాద్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు : కేటీఆర్

రైతులకు సాగునీరు ఇవ్వలేని ఈ దద్దమ్మ సర్కారు, ఇప్పుడు హైదరాబాద్‌లో ఉచిత తాగునీటి పథకానికి కూడా పాతరేయాలని చూడటం ముఖ్యమంత్రి మూర్ఖత్వానికి పరాకాష్ట అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ పథకాన్ని ముట్టుకుంటే ముఖ్యమంత్రి మసే..! హైదరాబాద్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు : కేటీఆర్

KTR, Revanth Reddy

Updated On : August 5, 2025 / 8:35 AM IST

KTR: కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇప్పటికే హైడ్రా వంటి దిక్కుమాలిన నిర్ణయాలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసి తీరని నష్టాన్ని కలిగించారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఉచిత తాగునీటి పథకానికి కూడా పాతరేయాలని చూడటం ముఖ్యమంత్రి మూర్ఖత్వానికి పరాకాష్ట అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్ చేశారు.

Also Read: తెలంగాణలోని రైతులకు గుడ్‌న్యూస్.. వారందరికీ రైతు బీమా.. ఈ ఫస్ట్‌వీక్‌లోగా అప్లయ్ చేసుకునే వెసులుబాటు..

హైదరాబాద్ వాసులకు కేసీఆర్ అందించిన ఉచిత మంచినీటి పథకాన్ని ముట్టుకుంటే ముఖ్యమంత్రి మసే..! 20నెలలు కావస్తున్నా.. ఇచ్చిన 420 హామీలు అమలు చేయలేక ఇప్పటికే చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి మహాపాపాన్ని మూటగట్టుకున్నారు. బీఆర్ఎస్ అమలు చేసిన పథకాలకు కూడా ఉరివేస్తే.. మహానగరంలోని కోటి 20లక్షల మంది ప్రజలు చరిత్రలో కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్‌ను క్షమించరు అంటూ కేటీఆర్ హెచ్చరించారు.

రైతులకు సాగునీరు ఇవ్వలేని ఈ దద్దమ్మ సర్కారు, ఇప్పుడు హైదరాబాద్‌లో ఉచిత తాగునీటి పథకానికి కూడా పాతరేయాలని చూడటం ముఖ్యమంత్రి మూర్ఖత్వానికి పరాకాష్ట. ఇప్పటికే హైడ్రా వంటి దిక్కుమాలిన నిర్ణయాలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసి తీరని నష్టాన్ని కలిగించారు. బీఆర్ఎస్ ప్రగతి ప్రస్థానంలో రెప్పపాటుకూడా కరెంటు కోతలులేని రాజధాని వాసులకు మళ్లీ కరెంట్ కష్టాలను పరిచయం చేసిన పాపం రేవంత్‌దే అంటూ కేటీఆర్ విమర్శించారు.

ఓవైపు అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ వ్యవస్థ, ఇంకోవైపు వర్షాలకు దెబ్బతిన్న రోడ్లతో ప్రజలు అవస్థలు పడుతుంటే.. ఫ్రీ వాటర్ స్కీమ్‌ను కూడా గండికొట్టాలని చూస్తున్న రేవంత్‌కు కర్రు గాల్చి పెట్టేందుకు హైదరాబాద్ ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ కేటీఆర్ అన్నారు.