మొదటి భార్యకు విడాకులిచ్చాడు, రెండో భార్య ఆత్మహత్య, మూడో భార్యను హత్య చేశాడు

ప్రకాశం జిల్లా గిద్దలూరులో దారుణం జరిగింది. ఓ భర్త ఉన్మాదిలా వ్యవహరించాడు. కట్టుకున్న భార్యను అతి

  • Published By: naveen ,Published On : May 11, 2020 / 05:58 AM IST
మొదటి భార్యకు విడాకులిచ్చాడు, రెండో భార్య ఆత్మహత్య, మూడో భార్యను హత్య చేశాడు

ప్రకాశం జిల్లా గిద్దలూరులో దారుణం జరిగింది. ఓ భర్త ఉన్మాదిలా వ్యవహరించాడు. కట్టుకున్న భార్యను అతి

ప్రకాశం జిల్లా గిద్దలూరులో దారుణం జరిగింది. ఓ భర్త ఉన్మాదిలా వ్యవహరించాడు. కట్టుకున్న భార్యను అతి దారుణంగా కడతేర్చాడు. ఆ తర్వాత మిద్దె పైనుంచి దూకి తీవ్ర గాయాల పాలయ్యాడు. గిద్దలూరు మండలం కొమ్మునూరు పంచాయతీ ఎగ్గెన్నపల్లె గ్రామంలో ఆదివారం(మే 10,2020) తెల్లవారుజామున ఓ వ్యక్తి నిద్రిస్తున్న తన భార్య తలపై సిమెంట్‌ దిమ్మెతో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఒంగోలు రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. 

ఎగ్గెన్నపల్లె గ్రామానికి చెందిన వర్రా వెంకటరమణకు సుమారు 30 ఏళ్ల కిందట మార్కాపురం అంబారుపల్లెకు చెందిన అనంతమ్మ(50)ను ఇచ్చి వివాహం చేశారు. వీరికి ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు. ఇద్దరు కూతుళ్లకు వివాహం చేశారు. మరో కూతురు, కొడుకు మార్కాపురంలోని బంధువుల ఇంటి దగ్గర ఉండి చదువుకుంటున్నారు. వారం రోజుల వరకు మార్కాపురంలో ఉన్న వెంకటరమణ ఇటీవలే ఎగ్గెన్నపల్లెలో ఉన్న భార్య దగ్గరికి వచ్చాడు. శనివారం(మే 9,2020) రాత్రి భార్యాభర్తలు ఇంటి వరండాలో నిద్రించారు.

ఇంతలో ఏం జరిగిందో కానీ వెంకటరమణ ఉన్మాదిలా మారాడు. ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో నిద్రిస్తున్న భార్య అనంతమ్మ తలపై సిమెంటు దిమ్మెతో దాడి చేశాడు. ఉలిక్కిపడి లేచిన ఆమె గట్టిగా కేకలు వేసింది. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకోవడంతో వెంకటరమణ ఇంటి మిద్దెపైకి వెళ్లి కిందికి దూకాడు. దాంతో అతడి చేతికి, కాలికి, నడుము భాగంలో గాయాలయ్యాయి. బంధువులు వెంటనే వారిద్దరిని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి.. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అనంతమ్మ మృతి చెందింది. 

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వెంకటరమణ భార్యను చంపడానికి కారణం ఏంటో తెలియదు. అనంతమ్మ వెంకటరమణకు మూడో భార్య. గతంలో మొదటి భార్యకు విడాకులిచ్చాడు. రెండో వివాహం చేసుకుంటే, ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత దూరపు బంధువైన అనంతమ్మను పెళ్లి చేసుకున్నాడు వెంకటరమణ. ఏళ్లు గడిచాయి. కాపురం సజావుగా సాగిపోతోంది. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేశారు. మరో ఇద్దరు బిడ్డలు చదువుకుంటున్నారు. అంతా సవ్యంగా సాగిపోతోందని అనుకుంటుండగా… ఏమైందో కానీ వెంకటరమణ ఈ దారుణానికి ఒడిగట్టాడు. 

రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వెంకటరమణ భార్యను ఎందుకు చంపాడు? అసలేం జరిగింది? అనే వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు. కాగా, అనుమానం పెనుభూతమైందని, భార్యపై అనుమానం పెంచుకున్న వెంకటరమణ ఈ దారుణానికి ఒడిగట్టాడని స్థానికులు చెబుతున్నారు.

Read More :

*  లాక్‌డౌన్‌లో భార్యలకు నరకం చూపిస్తున్న భర్తలు!

మద్యం మత్తులో ట్రాన్స్ ఫార్మర్ ముట్టుకుని తాగుబోతు మృతి, జగిత్యాలలో దారుణం