అప్పుడు తల్లిని.. ఇప్పుడు కొడుకుని.. మద్యం మానేయమన్నందుకు చంపేశాడు

  • Published By: vamsi ,Published On : May 13, 2020 / 06:31 AM IST
అప్పుడు తల్లిని.. ఇప్పుడు కొడుకుని.. మద్యం మానేయమన్నందుకు చంపేశాడు

దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో తన కొడుకును కాల్చి చంపిన కేసులో 60 ఏళ్ల వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం మానేయమన్నందుకు 33 ఏళ్ల క్రితం తల్లిని చంపేసిన అతను.. అదే కారణంగా ఇప్పుడు కొడుకును కూడా తుపాకితో కాల్చి చంపేశాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని రోహిణి ప్రాంతానికి చెందిన ప్రాపర్టీ డీలర్‌ ఓమ్‌పాల్‌ మ​ద్యానికి బానిస. 1987లో మద్యం తాగొద్దని హెచ్చరించిన తల్లి మాయాదేవిని చంపి జైలుకు వెళ్లాడు. శిక్ష అనుభవించి ఇంటికి తిరిగొచ్చినా కూడా అతనిలో మార్పు రాలేదు. మద్యం మానలేదు. 

ఈ క్రమంలోనే భార్య పవిత్రా దేవీ అతనిని మద్యం మానేయాలని కోరగా.. వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ మధ్యలో కుమారుడు అడ్డం రాగా వారి మధ్య కూడా గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన ఇంటి లోపలికి వెళ్లి, లైసెన్స్ పొందిన పిస్టల్ తీసుకొని కొడుకుపై కాల్పులు జరిపాడు. కుమారుడు అక్కడికక్కడే చనిపోయాడు. నిందితుని పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.