పేదలకు సీఎం జగన్ వరం : రాజధానిలో లక్ష ఇళ్లు నిర్మాణం

విజయవాడలో లక్ష ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందుకోసం వెయ్యి ఎకరాలు స్థలం, వెయ్యి కోట్ల రూపాయలు అవసరం అవుతుందని ప్రాథమికంగా అంచనా

  • Published By: veegamteam ,Published On : August 23, 2019 / 02:37 AM IST
పేదలకు సీఎం జగన్ వరం : రాజధానిలో లక్ష ఇళ్లు నిర్మాణం

విజయవాడలో లక్ష ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందుకోసం వెయ్యి ఎకరాలు స్థలం, వెయ్యి కోట్ల రూపాయలు అవసరం అవుతుందని ప్రాథమికంగా అంచనా

టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిన 6 వేలకు పైగా ఇళ్లను రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం.. మరోవైపు లక్ష ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల మేనిఫెస్టో హామీలపై దృష్టి పెట్టిన సీఎం జగన్… ఇప్పటికే నవరత్నాలు, మద్యపాన నిషేధంపై గైడ్ లైన్స్ విడుదల చేశారు. ఇక, పేదవాడికి సొంతింటి కల నెరవేర్చే దిశగా కార్యాచరణ ప్రారంభించారు. రాజధాని నగరం విజయవాడలో లక్ష ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందుకోసం వెయ్యి ఎకరాలు స్థలం, వెయ్యి కోట్ల రూపాయలు అవసరం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఉగాది నాటికి పేదల ఇంటి కల సాకారం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల పేదలకు ఇళ్ల స్ధలాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

విజయవాడ నగరంలో ఇళ్ల స్థలాలు ఇవ్వడం సాధ్యపడదని తెలుసుకున్న ప్రభుత్వం.. ఇళ్లనే నిర్మించి ఇవ్వాలని భావిస్తోంది. ఇందులో భాగంగా జీ+3 పద్ధతిలో ఇళ్లు నిర్మించాలని నిర్ణయించింది. ఒక్క ఎకరానికి జీ+3 పద్ధతిలో 100 ఇళ్లు నిర్మిస్తారు. ఈ లెక్కన వెయ్యి ఎకరాల్లో లక్ష ఇళ్లు నిర్మించాలని అంచనా. విజయవాడలో వెయ్యి ఎకరాలు సేకరించడం అసాధ్యం. దీంతో నగర శివార్లు, పరిసర ప్రాంతాల్లో సేకరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పరిసర ప్రాంతాలైన రామవరప్పాడు, జూపూడి, అంబాపురం, జక్కంపూడి, నున్న, గొల్లపూడి తదితర గ్రామాల్లో భూముల కోసం రెవెన్యూ శాఖ అన్వేషిస్తోంది. ఆయా గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలు గుర్తించడంతో పాటు వాటికి దగ్గరలోనే ఉన్న రైతుల నుంచి కొనుగోలు చేయాలని భావిస్తున్నారు.

ఉగాది నాటికి అర్హులైన పేదలకు ఇళ్లు లేదా ఇళ్ల స్థలాలు అందివ్వాలన్న లక్ష్యంతో సీఎం జగన్ పని చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గృహ నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం మంజూరు చేసే 25లక్షల ఇళ్లలో లక్ష ఇళ్లు విజయవాడ నగరానికి కేటాయించినట్లు అధికారులు చెబుతున్నారు. రాబోయే ఐదేళ్లలో ఈ లక్ష ఇళ్లు నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేశారు. విజయవాడ నగరంలో ఇప్పటికే 1.25లక్షల మంది పేదలు ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 

ప్రస్తుతం విజయవాడ చుట్టు పక్కల గ్రామాల్లో కనీసం రూ.కోటి పెట్టందే ఎకరా పొలం లభించని పరిస్థితి. వెయ్యి ఎకరాలు కొనుగోలు చేయాలంటే కనీసం వెయ్యి కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అసైన్డ్, ప్రభుత్వ భూములు, నిరుపయోగంగా ఉన్న పారిశ్రామిక భూములను కూడా తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. స్థల సేకరణకు సంబంధించి ఇప్పటికే అధికారులు మూడు సమావేశాలు నిర్వహించారు. భూముల లభ్యత గురించి చర్చించారు. సీఎం జగన్ నిర్ణయం పట్ల పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సొంతింటి కల నెరవేరుతుందని ఆనంద పడుతున్నారు.

Also Read : పోలవరంపై ప్రయోగాలు వద్దు – చంద్రబాబు