Daggubati Purandhareswari : ఆడుదాం ఆంధ్రా ఏమోగానీ.. ఆంధ్రాతో మాత్రం జగన్ ఆడుకుంటున్నారు
జగనన్న కాలనీల పరిస్థితి అందరికీ తెలుసు.. వర్షానికి పునాదులతో సహా కూలిపోతున్నాయని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విమర్శించారు.
- Harishth Thanniru
- Published On : December 16, 2023 / 02:50 PM IST
Daggubati Purandheswari,
Andhra Pradesh BJP : త్వరలోనే పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తానని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. శనివారం ఆమె ఏలూరులో పర్యటించారు. పోలవరం ప్రాజెక్ట్ అంటే నీళ్లు తోడుకోవాల్సిన పరిస్థితి.. కానీ, ప్రస్తుత రాజకీయ పార్టీలు మాత్రం డబ్బులు తోడుకుంటున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వమే పోలవరం నిధులు పూర్తిస్థాయిలో ఇస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వంతో రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలపై అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నానని తెలిపారు. అన్నిచోట్ల కార్యకర్తలతో మాట్లాడి కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని అన్నారు.
తొమ్మిదిన్నర సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ రహదారులు, ఇతర ప్రాజెక్టులు పరిశీలించి ప్రారంభానికి సిద్ధమవుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి పనికి కేంద్ర సహకారం పూర్తిగా ఉందని పురంధేశ్వరి పేర్కొన్నారు. ఏలూరు మెడికల్ కాలేజీకి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని, ఏలూరు జిల్లాలో లక్షకుపైగా ఇల్లు కేటాయింపు చేశామని చెప్పారు.
జగనన్న కాలనీల పరిస్థితి అందరికీ తెలుసు.. వర్షానికి పునాదులతో సహా కూలిపోతున్నాయని పురంధేశ్వరి విమర్శించారు. ఉపాధి పథకం ద్వారా 6.77 లక్షల మందికి సహాయం అందించామని తెలిపారు. ఆడుదాం ఆంధ్రా ఏమోగానీ ఆంధ్రాతో మాత్రం జగన్ ఆడుకుంటున్నాడని విమర్శించారు. కేంద్రం ఇచ్చే నిధులతో జగన్ తన పేరు చెప్పుకొని ప్రజలకు ఇస్తున్నాడరని పురంధేశ్వరి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతి మయం, విషపూరితంగా తయారైందని, అవినీతిని ప్రశ్నించిన వారిపై ఎస్సీఎస్టీ కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతికి 2500 కోట్ల రూపాయిలు టీడీపీ హయాంలో ఇచ్చామని అన్నారు.
మిగ్ జాం తుఫాన్ కి మొట్టమొదటిగా స్పందించి బీజేపీ అని, దెబ్బతిన్న పొగాకు, వరి పంట నష్టాన్ని నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకు వెళ్ళామని చెప్పారు. జనసేనతో బీజేపీ పొత్తు ఎప్పటికీ అలానే ఉంటుందని పురంధేశ్వరి అన్నారు. రాష్ట్రంలో నకిలీ ఓట్లపై ఢిల్లిలో ఎలక్షన్ కమిషనర్ ను కలిసి పిర్యాదు చేశామని అన్నారు.
