Anantapur: ఏపీ, అనంతపురంలో బ్యాంక్ పేరుతో భారీ మోసానికి పాల్పడ్డ ముఠా వ్యవహారం బయటపడింది. నకిలీ బ్యాంక్ పేరుతో మోసానికి పాల్పడింది ఒక కుటుంబం. స్థానిక తపోవనం సర్కిల్లో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు కలిసి, ఎల్డీఆర్కే నిధి ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేశారు.
కొంతమంది ఏజెంట్లను కూడా నియమించుకున్నారు. తర్వాత తక్కువ వడ్డీకే రుణాలిస్తామని నమ్మించారు. దాదాపు 2,123 మంది నుంచి లక్షల రూపాయల వసూలు చేసి డిపాజిటర్లకు కుచ్చుటోపీ పెట్టారు. ఈ సంస్థ ద్వారా నిర్వాహకులు డిపాజిటర్లనే కాకుండా, ఏజెంట్లను కూడా మోసం చేశారు. ఒక బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ ఘరానా మోసం వెలుగు చూసింది. బ్యాంకుకు చెందిన మొత్తం ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ జరుపుతున్న పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
అనంతపురం, నాలుగవ పట్టణ సీఐ జాకీర్ హుసేన్ మాట్లాడుతూ… ఈ సంస్థ వంద మంది ఏజెంట్లను కూడా మోసం చేసిందన్నారు. బ్యాంకుకు చెందిన నలుగురిని అరెస్టు చేశామని, మరో ముగ్గురిని అరెస్టు చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. తదుపరి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మోసానికి సంబంధించిన పూర్తి లెక్కలు తెలియాల్సి ఉంది.