రైతులపై వ్యవసాయ మంత్రి ఫైర్
- venkaiahnaidu
- Published On : January 22, 2021 / 03:47 PM IST
11 round talks నూతన వ్యవసాయ చట్టాలపై ఇవాళ(జనవరి-22,2021)రైతు సంఘాల నేతలతో కేంద్రం 11వ విడత చర్చలు జరుపుతోంది. ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో చర్చలు జరుగుతన్నాయి. ప్రభుత్వం తరపున ముగ్గురు కేంద్రమంత్రులు ఈ మీటింగ్ కు హాజరయ్యారు. అయితే, 11వ దఫా చర్చల్లో భాగంగా.. రైతులపై కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
సాగు చట్టాలను ఏడాదిన్నర పాటు నిలిపివేస్తామని.. 10వ దఫా చర్చల్లో కేంద్రం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీనిపై ఆలోచించి చెబుతామని చెప్పి రైతులు భేటీని ముగించారు. అయితే ఈ ప్రదిపాదనను రైతులు తిరస్కరించారంటూ గురువారం మీడియాలో వార్తలొచ్చాయి. ఈ విషయమై ఇవాళ చర్చల సమయంలో రైతు నేతలపై వ్యవసాయశాఖ మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రతిపాదన తిరస్కరిస్తూ రైతులు పత్రికా ప్రకటన విడుదల చేయడంపై తోమర్ అసహనం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరిస్తే.. ఆ విషయం సమావేశానికి వచ్చి చెప్పాలి కానీ ముందుగా మీడియాకు చెప్పడమేంటని తోమర్ రైతు నేతలను ప్రశ్నించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇది ప్రజలను తప్పుదారి పట్టించడమేనని తోమర్ మండిపడినట్టు పేర్కొన్నాయి. మరో వైపు.. ప్రభుత్వం, రైతుల మధ్య జరుగుతున్న చర్చల సంభాషణలు బయటకు ఎలా వెళుతున్నాయని తోమర్ ప్రశ్నించారు. దీని వెనకున్న ఆంతర్యం ఏంటని అడిగినట్టు తెలుస్తోంది.
మరోవైపు, తాము ఇప్పటికే మంచి ప్రతిపాదనను రైతులకు అందించామని మీ సమావేశం సందర్భంగా కేంద్రమంత్రులు వ్యాఖ్యానించగా..చట్టాల రద్దే తమకు కావాల్సిందని మరోమారు రైతు సంఘాల నేతలు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.
