తెలంగాణలో కొత్తగా R ట్యాక్స్ వసూలు చేస్తున్నారు: బీజేపీ శాసనసభా పక్షనేత మహేశ్వర్ రెడ్డి

Alleti Maheshwar Reddy: తమ ఎమ్మెల్యేల్లో ఒక్కరిని టచ్ చేసినా 48 గంటలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించారు.

Alleti Maheshwar Reddy

తెలంగాణలో కొత్తగా R టాక్స్ వసూలు చేస్తున్నారని బీజేపీ శాసనసభా పక్షనేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. R టాక్స్ అంటే రేవంత్ ట్యాక్సా, రాహుల్ టాక్సా, రాజీవ్ టాక్సా అని అడిగారు. ఇప్పటికి రూ.1,500 కోట్లు డబ్బులు పంపించారని, ఇంకా రూ.500 కోట్ల పంపడం కోసం ఈ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని చెప్పారు.

చిట్టా మొత్తం తమ వద్ద ఉందని తెలిపారు. సందర్భం వచ్చినప్పుడు అన్ని బయట పెడతామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేకే ఎదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకొస్తూ ప్రజలను మభ్యపెడుతోందని మహేశ్వర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ సర్కారు అభద్రతా భావంతో పని చేస్తోందని, ప్రస్తుత పరిణామాలే దాన్ని రుజువు చేస్తున్నాయని తెలిపారు.

ముఖ్యమంత్రి పదవి ఇతర మంత్రుల్లో ఒకరు చేజిక్కించుకుంటారని రేవంత్ రెడ్డికి భయంతో నిద్ర పట్టడం లేదని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీతో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారని చెప్పారు.

48 గంటల్లో ప్రభుత్వం కూలిపోతుంది జాగ్రత్త
తమ ఎమ్మెల్యేల్లో ఒక్కరిని టచ్ చేసినా 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించారు. రేవంత్ రెడ్డిలాంటి వారు ఐదుగురు మంత్రులు బీజేపీ హైకమాండ్ తో టచ్ లో ఉన్నారని చెప్పుకొచ్చారు.

రంజిత్ రెడ్డి భూములపై రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారని, ఇప్పుడు ఆయనను కండువా కప్పి పక్కన కూర్చో పెట్టుకున్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎందుకు సీబీఐ విచారణ జరిపించడం లేదని నిలదీశారు. బీజేపీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడే స్థాయి రేవంత్ రెడ్డికి లేదని చెప్పారు. భువనగిరి సీటును రెండు లక్షల మెజార్టీతో గెలుస్తామని అన్నారు.

Also Read: చంద్రబాబు డైరెక్షన్‌లో సీఎం రేవంత్.. తెలుగుదేశం మాస్క్‌తో కాంగ్రెస్ ప్రభుత్వం: ఎర్రోళ్ల శ్రీనివాస్

ట్రెండింగ్ వార్తలు